అమెరికాలో స్థిరపడిన తెలుగమ్మాయి నిత్యా కొడాలి అరుదైన ఘనతను సాధించారు.భారత్ సహా 40 దేశాల నుంచి వచ్చిన ఎంట్రీలను తోసిరాజని తొలిసారిగా నిర్వహిస్తున్న ‘ మిస్ టీన్ తెలుగు యూనివర్స్’ గా ఎంపికైంది.ఈ నెల ఆరంభంలో మిస్ టీన్ తెలుగు యూనివర్స్ గ్రాండ్ ఫైనల్లో పాల్గొన్న 22 మంది ఫైనలిస్టులలో కొడాలి ఒకరు.15 ఏళ్ల ఈమె సోఫోమోర్లోని ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నారు.18,000 మంది పాల్గొన్న ఈ పోటీల్లో తెలుగు ఉచ్ఛారణ, రాంప్ వాక్, టాలెంట్, ప్రశ్నలు- సమాధానాలు ఆధారంగా విజేతను ఎంపిక చేశారు.ఫైనల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మిస్ ఎర్త్ ఇండియా తేజస్విని మనోజ్ఞ.
నిత్యకు కీరిటాన్ని ధరింపజేశారు.తన మొట్టమొదటి పోటీలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన టైటిల్ గెలవడం గర్వంగా ఉందని, ఈ విజయం తనలో ఆత్మ విశ్వాసాన్ని రెట్టింపు చేసిందని నిత్య తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు.
ఈ విజయం తనది మాత్రమే కాదని.ఈ రోజు తనకు తెలిసిన ప్రతి దానిని నాకు నేర్పించిన నా జీవితంలోని అద్భుత వ్యక్తులకు ఈ కీరిటం అంకితమని ఆమె అన్నారు.
కాగా ఇదే పోటీలో మొదటి రన్నరప్గా సాత్విక మొవ్వ, రెండవ రన్నరప్గా సుస్మితా కొల్లోజు నిలిచారు.ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగు యువతులలో తెలుగు సంస్కృతి పెంపొందించడం, ప్రొత్సహించడం, అభివృద్ధి చేయడమే నిర్వాహకుల ఉద్దేశ్యం.
డాక్టర్ కావడమే తన లక్ష్యంగా చెబుతున్న నిత్యా కొడాలి. ‘ లెటర్స్ అండ్ లవ్’ అనే ఎన్జీవోను స్థాపించారు.పూర్తిగా విద్యార్ధుల భాగస్వామ్యంతో నడుస్తున్న ఈ సంస్థ.కేవలం అక్షరాల ద్వారా మనిషిలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తోంది.
నిత్యకు భరత నాట్యంలోనూ ప్రవేశం వుంది.అంతేకాకుండా హ్యూస్టన్ బాలీవుడ్ డ్యాన్స్ గ్రూప్లో సభ్యురాలు కూడా.
తెలుగు భాష సంస్కృతిని ప్రోత్సహించేందుకు గాను హ్యూస్టన్లోని స్థానిక తెలుగు పాఠశాలలో స్వచ్ఛందంగా టీచర్గా పనిచేస్తోంది నిత్య.మరోవైపు మిస్ టీన్ తెలుగు యూనివర్స్ గెలిచిన తర్వాత నిత్య మరో రెండు టైటిళ్లను తన ఖాతాలో వేసుకుంది.
అవి మిస్ యువరాణి యూఎస్ఏ, మిస్ ఇంటర్నేషనల్ కంజెనియాలిటీ.సెల్ఫ్ డెవలప్మెంట్, ఆత్మ విశ్వాసం పెంపొందించుకునేందుకు ఇటువంటి పోటీలు మంచి అవకాశమని ఆమె చెప్పారు.