భారతదేశంలో ముస్లింలపై బీజేపీ ప్రభుత్వ అణచివేత ధోరణిపై అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ప్రవాసీ సంస్థ ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ (ఐఏఎంసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది.భారతదేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గడిచిన ఏడేళ్లుగా ఇస్లామోఫోబియా పెరుగుతోందని సంస్థ ఆరోపించింది.
మోడీ పాలనలో భారతీయ ముస్లింలు క్లిష్ట సమయాన్ని ఎదుర్కొంటున్నారని మండిపడింది.
ఇటీవల సెప్టెంబర్ 20న ఈశాన్య రాష్ట్రమైన అసోంలో దాదాపు 800 మంది బెంగాలీ మాట్లాడే ముస్లిం కుటుంబాల ఇళ్లను కూల్చివేశారని.
ఇందులో నాలుగు మత నిర్మాణాలు సైతం వున్నాయని ఐఏఎంసీ తెలిపింది.ఈ కూల్చివేతలు ఆపాలని 246 మంది నిర్వాసితులు స్టే కోసం పిటిషన్ దాఖలు చేశారు, దీనిపై కోర్టు విచారణ వాయిదా వేసిందని అయినప్పటికీ ఈ దాడి జరిగిందని సంస్థ మండిపడింది.
దీనిని ఐఏఎంసీ ఖండిస్తున్నట్లు తెలిపింది.చెట్లు, గుడిసెల వెనుక దాక్కొన్న పౌరులపై పోలీసులు కాల్పులు జరపడంపై కౌన్సిల్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారని.వారిలో షేక్ ఫరీద్ అనే 12 ఏళ్ల బాలుడు కూడా వున్నాడని తెలిపింది.
మరో బాధితుడు మొయినుల్ హక్ ఛాతీపై కాల్చి అనంతరం కర్రలతో కొట్టి చంపారని ఐఏఎంసీ ఆరోపించింది.మరణం తర్వాత కూడా అక్కడే వున్న ఫోటోగ్రాఫర్ ఒకరు మృతదేహాన్ని పదేపదే తన్నడం వీడియోలలో కనిపించిందని ఐఏఎంసీ ఆవేదన వ్యక్తం చేసింది.
కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కు లేకపోవడంతో అతని భార్యాపిల్లలు, తల్లిదండ్రులు అనాథలయ్యారని తెలిపింది.
జరిగింది ఇది:
ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలగించే దిశగా అస్సాం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.ఈ మేరకు దరాంగ్ జిల్లాలో ఆక్రమణలను తొలగించే ప్రక్రియను జిల్లా యంత్రాంగం ప్రారంభించింది.దాదాపు 1488 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుంచి తొలగించి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.జిల్లా యంత్రాంగం పోలీసులు, పారామిలటరీ బలగాల సహాయంతో ఈ పని పూర్తి చేశారు.4500 బిగాల భూమిని 800 మంది వలస ముస్లిం కుటుంబాలు చట్ట విరుద్దంగా ఆక్రమించాయి.గత కొన్నేండ్లుగా ముస్లింలు ఈ భూములను అక్రమించి నివాసం ఏర్పాటు చేసుకున్నారు.ప్రభుత్వ యంత్రాంగం ఎన్నిసార్లు నోటీసు ఇచ్చినా కూడా భూములు ఖాళీ చేయలేదు.
దీంతో ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్టు అధికారులు తెలిపారు.దీనిలో భాగంగా సిపజార్ నియోజకవర్గం పరిధిలోని దరాంగ్ జిల్లాలోని ధల్పూర్ ప్రాంతంలో ఆక్రమణలను అధికారులు తొలగించారు.దీంతో దల్పూర్ ప్రాంతంలోని ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న మరో 300 అక్రమ నివాసాలు తొలగింపు చర్యలు నిలిపివేయాలని కొందరు గౌహతి హైకోర్టును ఆశ్రయించారు.ఈ వ్యక్తులు దాదాపు 9000 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని అధికార వర్గాలు తెలిపాయి.
ఆక్రమణలు తొలగించిన తర్వాత ఈ భూముల్లో రాష్ట్ర ప్రభుత్వం మెగా వ్యవసాయ ప్రాజెక్టును చేపట్టనుంది.దీనికి ‘గోరుఖుతి వ్యవసాయ ప్రాజెక్ట్’ అని పేరు పెట్టారు.దీని ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు.
దిగువ అస్సాంలోని బార్పేటలో బెంగాలీ మాట్లాడే ముస్లింల ఆధిపత్యం ఉన్న ప్రాంతంలో ఆక్రమణల తొలగింపు ఎక్కువగా జరగడంతో ప్రస్తుతం ఈ రగడ జరుగుతోంది.
తనను కలవడానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ శాసనసభ్యులకు కూడా ఇదే విషయాన్ని వివరించానని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు.అయితే ఈ హింసాకాండ వెనుక అతివాద ఇస్లామిక్ గ్రూప్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) ఉందని ముఖ్యమంత్రి ఆరోపించారు.