సున్నాను కనిపెట్టిన భారతీయులు ప్రపంచ గణిత శాస్త్రానికి అద్భుతమైన కానుక అందించారు.సున్నా ఆవిష్కరణతో గణిత శాస్త్రం గొప్ప ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి.
ఆ తర్వాత దశాంశ పద్దతిని కనిపెట్టింది భారతీయులే కావడం విశేషం.భారతీయ గణిత చరిత్రకు ఆధునిక కాలంలో శ్రీనివాస రామానుజన్ మెరుగులు దిద్దారు.
కాలక్రమంలో ఎందరో భారతీయ శాస్త్రవేత్తలు గణితం అభివృద్ధికి కృషి చేశారు.ఇది నేటికీ కొనసాగిస్తూ.
వారు దేశానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడుతున్నారు.
తాజాగా భారత సంతతికి చెందిన గణిత శాస్త్రవేత్త నిఖిల్ శ్రీవాస్తవకు అరుదైన అవార్డు దక్కింది.1959 నాటి మేథమేటికల్ సమస్యకు పరిష్కారాన్ని కనుగొన్న నేపథ్యంలో నిఖిల్ శ్రీవాస్తవ ప్రతిష్టాత్మక ‘‘సిప్రియాన్ ఫోయాస్ ప్రైజ్’’కు ఎంపికయ్యారు.ఆపరేటర్ థియేరీలో అమెరికన్ మేథమేటికల్ సొసైటీ ఈ అవార్డుకు ఎంపిక చేసింది.
ప్రస్తుతం కాలిఫోర్నియా యూనివర్సిటీలో నిఖిల్ శ్రీవాస్తవ అధ్యాపకుడిగా ఉన్నారు.సిప్రియాన్ అవార్డును నిఖిల్తో పాటు ఆడమ్ మార్కస్, డానియల్ స్పిల్మ్యాన్లు సంయుక్తంగా గెలుచుకున్నారు.
వచ్చే ఏడాది జనవరి 5న సియాటెల్లో జరిగే జాయింట్ మ్యాథమెటిక్స్ మీటింగ్ ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.గణితశాస్త్రంలో నిఖిల్ శ్రీవాస్తవ అవార్డులు పొందడం కొత్తేమీ కాదు.
గతంలో 2014లో జార్జ్ పోలియా ప్రైజ్, 2021లో హెల్డ్ ప్రైజ్లను కూడా ఆయన గెలుచుకున్నాడు.ఆపరేటర్ థియరీలో రిచర్డ్ కడిసన్, ఇసడోర్ సింగర్లు 1959లో విసిరిన ప్రశ్నకు నిఖిల్ ఇప్పుడు పరిష్కారాన్ని కనుగొన్నారు.
ఢిల్లీలో పుట్టిన నిఖిల్ శ్రీవాస్తవ.న్యూయార్క్లోని యూనియన్ కాలేజ్లో సైన్స్, మేథమేటిక్స్లో డిగ్రీని అందుకున్నారు.2010లో యేల్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్లో పీహెచ్డీ పట్టా పొందారు.గణిత శాస్త్రంలో అద్భుత ప్రతిభ కనబరిచిన ఆయనను 2014లో జరిగిన ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ మేథమేటిక్స్లో ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా నిర్వాహకులు ఆహ్వానించారు.