అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ నిర్ణాయాత్మక ఓటుతో భారతీయ అమెరికన్ న్యాయ కోవిదురాలు కిరణ్ అహుజాకు కీలక పదవి దక్కింది.దేశంలోని రెండు మిలియన్లకు పైగా ప్రభుత్వ ఉద్యోగులను నియంత్రించే ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ చీఫ్ పదవికి కిరణ్ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేశారు.అయితే ఆమె నియామకాన్ని ధ్రువీకరించేందుకు సెనేట్లో ఓటింగ్ జరిగింది.100 సీట్లున్న సెనేట్లో రిపబ్లికన్లు, డెమొక్రాట్లకు సరిసమానంగా బలం వున్న సంగతి తెలిసిందే.దీంతో ఓటింగ్ సందర్భంగా కిరణ్కు 50-50 ఓట్లు లభించడంతో ప్రతిష్టంభన నెలకొంది.అయితే రాజ్యాంగం ప్రకారం అమెరికా ఉపాధ్యక్షుడికి నిర్ణాయాత్మక ఓటు వుంటుంది.దీంతో ఆ హోదాలో వున్న భారత సంతతికి చెందిన కమలా హారిస్.తన ఓటుతో సమస్యను పరిష్కరించి కిరణ్ అహుజాకు కీలక పదవి దక్కేలా చేశారు.
తద్వారా ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ చీఫ్ పదవికి ఎంపికైన తొలి భారతీయ అమెరికన్గా ఆమె రికార్డుల్లోకి ఎక్కారు.కాగా, దీనితో కలిపి కమలా హారిస్ తన నిర్ణయాత్మక టై బ్రేకింగ్ ఓటును ఈ ఏడాది ఆరోసారి వినియోగించినట్లయ్యింది.
కిరణ్ అహుజాకు అమెరికాలో హక్కుల కార్యకర్తగా మంచి గుర్తింపు వచ్చింది.దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఆమె ప్రజాసేవలో ఉన్నారు.ఒబామా హయాంలో వైట్హౌస్ తలపెట్టిన ఏషియన్ అమెరికన్స్ అండ్ పసిఫిక్ ఐలాండర్స్ (ఏఏపీఐ) కార్యక్రమానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేశారు.డైరెక్టర్ ఆఫ్ యూఎస్ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్కు 2015 నుంచి 2017 వరకు కిరణ్ అహుజా చీఫ్ ఆఫ్ స్టాఫ్గా బాధ్యతలు నిర్వర్తించారు.
ఆమె ప్రస్తుతం రీజనల్ నెట్వర్క్ ఆఫ్ ఫిలాంథ్రాఫిక్ ఇన్స్టిట్యూషన్స్కు సీఈఓగా వ్యవహరిస్తున్నారు.కిరణ్ అహుజా చిన్నతనంలోనే ఆమె కుటుంబం భారత్ నుంచి అమెరికాలోని జార్జియాకు వచ్చి స్థిరపడింది.
ఆమె పొలిటికల్ సైన్స్లో బ్యాచ్లర్స్ డిగ్రీ .యూనివర్శిటీ ఆఫ్ జార్జియా నుంచి లా డిగ్రీని అందుకున్నారు.
అమెరికా న్యాయశాఖలో పౌరహక్కుల న్యాయవాదిగా కిరణ్ తన కెరీర్ను ప్రారంభించారు.పాఠశాలల వర్గీకరణ కేసులతో పాటు జాతి విద్వేషంపై పోరాడారు.2003 నుంచి 2008 వరకు కిరణ్ అహుజా నేషనల్ ఏషియన్ పసిఫిక్ అమెరికన్ ఉమెన్స్ ఫోరం వ్యవస్థాపక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేశారు.