అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జో బైడెన్ తన టీంలో భారతీయులకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ వెళుతున్నారు.భారతీయుల సామర్ధ్యంపై నమ్మకం వుంచిన అమెరికా అధ్యక్షుడు ముఖ్యమైన విభాగాలకు అధిపతులుగా మనవారినే నియమిస్తున్నారు.
కొద్దినెలల క్రితం ఇండియన్-అమెరికన్ న్యాయవాది, సామాజిక కార్యకర్త సరళా విద్యా నాగలాను కనెక్టికట్ రాష్ట్రంలోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు ఫెడరల్ జడ్జిగా బైడెన్ నామినేట్ చేసిన సంగతి తెలిసిందే.ఆమె నియామకానికి బుధవారం అమెరికా సెనేట్ ఆమోదముద్ర వేసింది.
తద్వారా దక్షిణాసియాకు చెందిన తొలి ఫెడరల్ జడ్జిగా సరళ చరిత్ర సృష్టించారు.విద్వేష నేరాలు, మానవ అక్రమ రవాణా, పిల్లల దోపిడీపై ఆమె కీలక కేసుల్లో వాదించారు.
అక్టోబర్ 27న జరిగిన సమావేశంలో సరళ నియామకానికి సెనేట్ 52-46 ఓట్లతో ఆమోదం తెలిపింది.అలాగే అక్టోబర్ 28న ఒమర్ విలియమ్స్ నియామకానికి కూడా సెనేట్ 52-46 ఓట్లతో ఆమోదముద్ర వేసింది.
సరళకు ముందు ఈ పోస్టులో వెనెస్సా బ్రయంట్ పనిచేశారు.కనెక్టికట్కు చెందిన ఇద్దరు డెమొక్రాట్ సెనేటర్లు రిచర్డ్ బ్లూమెంటల్, క్రిస్ మర్ఫీల సిఫారసు ఆధారంగా జో బైడెన్… సరళ, ఒమర్లను జూన్లో నామినేట్ చేశారు.
సరళా ప్రస్తుతం కనెక్టికట్ జిల్లాలోని యుఎస్ అటార్నీ కార్యాలయంలో మేజర్ క్రైమ్స్ యూనిట్కు డిప్యూటీ చీఫ్గా వ్యవహరిస్తున్నారు.2017 నుండి ఆమె ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.2012లో యుఎస్ అటార్నీ కార్యాలయంలో చేరిన ఆమె… హేట్ క్రైమ్స్ కోఆర్డినేషన్ సహా పలు కీలక పదవుల్లో పనిచేశారు.2008లో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో బర్కిలీ స్కూల్ ఆఫ్లాలో జ్యూరిస్ డాక్టర్ డిగ్రీని పొందిన సరళ 2009లో జడ్జి సుషాన్ గ్రాబేర్ వద్ద క్లర్క్గా వ్యవహరించారు.దేశంలోని న్యాయస్థానాలు వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తాయని అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బైడెన్ ఒకానొక సందర్భంలో అన్నారు.అందుకు తగ్గట్టుగానే ఆయన నియామకాలు చేస్తూ వస్తున్నారు.
కాగా. నేషనల్ డ్రగ్ కంట్రోల్ పాలసీ డైరెక్టర్గా భారతీయ అమెరికన్ ప్రైమరీ కేర్ ఫిజిషియన్ డాక్టర్ రాహుల్ గుప్తా నియామకాన్ని యూఎస్ సెనేట్ గురువారం ధృవీకరించిన సంగతి తెలిసిందే.
తద్వారా వైట్హౌస్ ఆఫీస్ ఆఫ్ నేషనల్ డ్రగ్ కంట్రోల్ పాలసీ (ఓఎన్డీసీపీ)కి నాయకత్వం వహించిన మొదటి వైద్యుడిగా రాహుల్ చరిత్ర సృష్టించారు.జార్జ్టౌన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో మెడిసిన్ విభాగంలో క్లినికల్ ప్రొఫెసర్గా పనిచేసిన డాక్టర్ గుప్తా నియామకానికి గురువారం సెనేట్ ఆమోదముద్ర వేసింది.