అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడాన్ని అక్కడి ఇండో అమెరికన్ సంఘాలు ఖండించాయి.ఈ చర్యకు కారణమైన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని ఆశిస్తున్నట్లు వారు తెలిపారు.
ఉత్తర కాలిఫోర్నియా డేవిస్ నగరంలోని సెంట్రల్ పార్క్లో వున్న 6 అడుగుల ఎత్తు, 650 పౌండ్ల బరువున్న మహాత్ముని కాంస్య విగ్రహాన్ని ఈ వారం ప్రారంభంలో గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఓ భారత సంతతి ఎన్జీవో సంస్థ నేరస్థులను చట్టం ముందు నిలబెట్టడంతో పాటు మహాత్ముడి విగ్రహాన్ని పున: ప్రతిష్టించే ప్రక్రియను ప్రారంభించాలని డేవిస్ నగర యంత్రాన్ని కోరింది.అహింసకు ప్రేరణగా నిలిచిన మహనీయుల్లో ఒకరైన మహాత్ముని విగ్రహాన్ని కూల్చివేయడం బాధాకరమని సదరు సంస్థ అభిప్రాయపడింది.2016లో డేవిస్ సిటీ కౌన్సిల్ నగరంలోని సెంట్రల్ పార్క్లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఆమోదముద్ర వేసింది.గాంధీ వ్యతిరేక, భారత వ్యతిరేక సంస్థల నిరసనల మధ్య భారత ప్రభుత్వం డేవిస్ నగరానికి విరాళంగా ఇచ్చిన గాంధీ విగ్రహాన్ని నాలుగేళ్ల క్రితం నగర కౌన్సిల్ ప్రతిష్టించింది.
డేవిస్ పట్టణంలోని మహాత్మాగాంధీ విగ్రహాన్ని అపవిత్రం చేసి, ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇండియన్ నేషనల్ ఓవర్సీస్ కాంగ్రెస్ (ఐఎన్ఓసీ) ఓ ప్రకటనలో తెలిపింది.ప్రతి భారతీయుడి స్వేచ్ఛ కోసం ఆయన ప్రాణాలు త్యాగం చేశారని ఆ మహనీయుని వర్ధంతికి రెండ్రోజుల ముందు దుండగులు ఈ నీచమైన చర్యకు దిగడం మరింత బాధ కలిగించిందని ఐఎన్ఓసీ ఆవేదన వ్యక్తం చేసింది.ఇదే సమయంలో అధికారిక దర్యాప్తును ప్రారంభించినందుకు డేవిస్ నగర యంత్రానికి ఐఎన్ఓసీ కృతజ్ఞతలు తెలిపింది.
ఈ దుర్మార్గపు చర్య మనోభావాలను దెబ్బతీసిందని భారతీయ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ అభిప్రాయపడింది.శాంతి, సమానత్వం, న్యాయం కోసం మహాత్మా గాంధీ చేసిన పోరాటం నుంచి మిలియన్ల మంది అమెరికన్లు సైతం ప్రేరణ పొందారని కౌన్సిల్ వెల్లడించింది.
మరోవైపు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన భారత విదేశాంగ శాఖ దుండగుల చర్యను ఖండించింది.గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అమెరికాను కోరింది.
ఈ ఘటనపై అధికారులు ప్రత్యేకంగా దర్యాప్తు జరుపుతున్నట్లు అమెరికాలోని భారత కాన్సులేట్ జనరల్ తెలిపారు.