అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భారతీయులకి తన కొలువులో కీలక బాధ్యతలు కల్పిస్తూ వస్తున్న జో బైడెన్ ఈ ఒరవడిని ఇంకా కొనసాగిస్తున్నారు.రానున్న కాలంలో మరింత మంది ఇండో అమెరికన్లకు ఉన్నత హోదా దక్కుతుందని విశ్లేషకులు అంటున్నారు.
తాజాగా తన జట్టులో వున్న భారతీయుడికి ప్రమోషన్ ఇచ్చారు జో బైడెన్.
అమెరికా పాలసీ అడ్వైజర్గా వ్యవహరిస్తోన్న గౌతమ్ రాఘవన్కు వైట్హౌజ్ ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ పర్సనల్ (పీపీఓ) అధిపతిగా కొత్త బాధ్యతలు అప్పగించారు జో బైడెన్.
అమెరికా అధ్యక్ష కార్యాలయంలో జరిగే కొత్త అపాయింట్మెంట్లను పీపీవో ఆఫీసు పరిశీలిస్తుంది.శ్వేతసౌధంలో పనిచేసే అభ్యర్థులను ఈ కార్యాలయం పూర్తిగా అంచనా వేసి రిక్రూట్ చేసుకుంటుంది.
గౌతమ్ రాఘవన్ ప్రస్తుతం పీపీవో డిప్యూటీ డైరక్టర్గా చేస్తున్నారు.ఇప్పటి వరకు ఈ ఆఫీస్ హెడ్ పోస్టులో ఉన్న క్యాథే రస్సెల్ యూనిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్గా వెళ్తున్నారు.
దీంతో ఆయన స్థానంలో ఖాళీ అయిన పోస్టుకు గౌతమ్ను నియమిస్తూ పదోన్నతి కల్పించారు జో బైడెన్.క్యాథే రస్సెల్తో కలిసి గౌతమ్ బాగా పనిచేశారని, పీపీవో కొత్త డైరక్టర్గా రాఘవన్ బాధ్యతలు చేపడుతారని బైడెన్ ఓ ప్రకటనలో తెలియజేశారు.
గౌతమ్ రాఘవన్ భారత్లో పుట్టారు.అనంతరం వీరి కుటుంబం అమెరికాకు వలస వెళ్లడంతో ఆయన సియాటిల్లో పెరిగారు.
స్టాన్ఫార్డ్ యూనివర్సిటీలో రాఘవన్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.వెస్ట్ వింగర్స్.
స్టోరీస్ ఫ్రమ్ ద డ్రీమ్ చేజర్స్, చేంజ్మేకర్స్, హోప్ క్రియేటర్స్ ఇన్సైడ్ ద ఒబామా వైట్ హౌజ్ అన్న పుస్తకానికి ఆయన ఎడిటర్గా చేశారు.ఆయన స్వలింగ సంపర్కుడు.భర్త, కూతురితో కలిసి వాషింగ్టన్ డీసీలో జీవిస్తున్నారు.2020, జనవరి 20 నుంచి అధ్యక్షుడికి డిప్యూటీ అసిస్టెంట్గా చేశారు.బైడెన్-హ్యారిస్లు అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా రిక్రూట్ చేసుకుంది రాఘవన్నే.
కాంగ్రెషనల్ ప్రోగ్రెసివ్ కాకస్ చైర్మన్ గా ఉన్న యూఎస్ ప్రతినిధి ప్రమీలా జయపాల్ కి చీఫ్ ఆఫ్ స్టాఫ్గా పనిచేశారు.అలాగే బైడెన్ ఫౌండేషన్కు సలహాదారుగా, వైస్ ప్రెసిడెంట్గా సేవలందిస్తూనే పౌర హక్కులు , సామాజిక న్యాయాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్న సంస్థలకు రాఘవన్ సలహా సేవలు అందించారు.