దేశం కానీ దేశంలో భర్త చనిపోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న మహిళకు అమెరికాలోని భారతీయ సమాజం అండగా నిలిచింది.అంజనీకుమార్ బచ్చలి, మను బచ్చలి పెన్సిల్వేనియాలో నివసిస్తున్నారు.
ఈ క్రమంలో అంజనీ కుమార్ ఫిబ్రవరి 29న చెస్టర్ స్ప్రింగ్స్లో ఒక్కసారిగా గుండెపోటుకు గురై కన్నుమూశారు.దీంతో ఆయన భార్య మనుకు ఆర్ధిక సాయం అందించేందుకు గాను కొందరు GoFundMeని ప్రారంభించారు.
దీనికి స్పందించిన ప్రవాస భారతీయులు, స్థానిక అమెరికన్లు ఇప్పటి వరకు 2,00,000 డాలర్లు విరాళంగా అందించినట్లుగా తెలుస్తోంది.
అంజనీకుమార్ గుండెపోటుతో కుప్పకూలిపోవడంతో తాను దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లానని మను బచ్చలి చెప్పారు.3 గంటల పాటు శ్రమించినప్పటికీ వైద్యులు తన భర్తను కాపాడలేకపోయారని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.తమకు 7 సంవత్సరాలు, 18 నెలల వయస్సున్న ఇద్దరు పిల్లలు ఉన్నారని ఆయన కుటుంబాన్ని ఎంతో ప్రేమగా చూసుకునేవారని చెప్పారు.
అంజీ ఆరోగ్యం పట్ల ఎంతో స్పృహతో ఉంటారని, ఫిట్నెస్ను ఎప్పుడూ కాపాడుకుంటారని మను తెలిపారు.తన కంపెనీ ఐటీ విభాగంలో అంజీ కీలకపాత్ర పోషిస్తూ ఉంటారని కేవలం 38 ఏళ్లకే ఆయన మమ్మల్ని వదిలి వెళ్లడం జీర్ణించులేకపోతున్నామని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.
అంజనీకుమారు హెచ్1బీ వీసా ద్వారా అమెరికాలో ఉంటున్నారని తను పిల్లలతో పాటు వారి కుటుంబానికి ఆయన ఆధారమని మను అన్నారు.
తాను ప్రస్తుతం డిపెండెంట్ వీసాపై ఉన్నానని, ఇప్పుడు దానిని ప్రభుత్వం ఉపసంహరించే ప్రమాదం ఉందని మను బచ్చలి తెలిపారు.అంజీ మరణంతో తాము తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని.దాతలు ఇచ్చిన విరాళాలతో కొంత ఉపశమనం దక్కే అవకాశం ఉందన్నారు.
కొంత సొమ్మును బెంగళూరులో ఉన్న తన మామగారి వైద్య ఖర్చుల కోసం పంపుతానని మను తెలిపారు.