అమెరికా రాజకీయాల్లో భారతీయుల పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.సెనేటర్లుగా, కాంగ్రెస్ సభ్యులుగా, మేయర్లుగా, కౌన్సిల్ సభ్యులుగా, చివరికి దేశంలో రెండో అత్యున్నత పదవి అయిన ఉపాధ్యక్ష పీఠాన్ని ఆధిరోహించి అగ్రరాజ్యాన్ని శాసిస్తున్నారు.2020 అధ్యక్ష ఎన్నికల్లో భారతీయుల పాత్ర ఏంటో ప్రపంచానికి అర్థమైంది.మెజారిటీ రాష్ట్రాల్లో విజేతల గెలుపు, ఓటములను నిర్దేశించగల స్థాయిలో వున్న ఇండో అమెరికన్ సమాజం.
బైడెన్ విజయాన్ని నల్లేరుపై నడకలా చేసింది.ఎన్నికలకు కొద్దినెలల ముందు నుంచే భారతీయులను ఆకట్టుకోవడానికి రిపబ్లికన్లు, డెమొక్రాట్లు ఎన్నో విన్యాసాలు చేశారు.
అయితే బైడెన్ వ్యూహాత్మకంగా భారతీయ సంతతికి చెందిన కమలా హారిస్ను వైస్ ప్రెసిడెంట్ అభ్యర్ధిగా ప్రకటించడంతో పరిస్ధితి మొత్తం మారిపోయింది.డెమొక్రాట్లకు ప్రవాసులు జై కొట్టడంతో ట్రంప్ ఆశలు గల్లంతయ్యాయి.
ఇక అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత కూడా బైడెన్.భారతీయులకే ప్రాధాన్యత గల కీలక పదవులను కట్టబెడుతూ వస్తున్నారు.
ఇక అసలు సంగతి ఏంటంటే.అమెరికాలో వచ్చే ఏడాది నవంబర్లో మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి.2024 ఎన్నికలకు సెమీఫైనల్స్గా భావిస్తున్న వీటిని రిపబ్లికన్లు, డెమొక్రాట్లు కీలకంగా భావిస్తున్నారు.ఈ ఎన్నికల్లో భారతీయులు కూడా బరిలో నిలవనున్నారు.
తాజాగా కాలిఫోర్నియా 42వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ఇండో అమెరికన్ మహిళ, ఇంజినీర్, ఔత్సాహిక పారిశ్రామికవేత్త శ్రినా కురణి పోటీ చేయనున్నారు.రిపబ్లికన్ నేత, రాజకీయ దిగ్గజం కెన్ కాల్వర్ట్తో తలపడనున్నారు.
కెన్ కాల్వర్ట్ 30 ఏళ్ల నుంచి అదే స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.ఈ సందర్భంగా శ్రినా మాట్లాడుతూ.
కాల్వర్ట్ మూడు దశాబ్ధాలుగా ఆ పదవిలో వున్నప్పటికీ ఈ ప్రాంతానికి ఆయన ఏమీ చేయలేదని, ఈసారి కొత్త పంథాలో వెళ్తానని ఆమె అన్నారు.
రివర్సైడ్లో స్థిరపడిన భారతీయ కుటుంబంలో జన్మించిన శ్రినా.లా సిరా హై స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.యూసీ రివర్సైడ్లో శ్రినా మెకానికల్ ఇంజినీరింగ్ పట్టా పొందారు.
అనంతరం ఆహార వ్యర్ధాల నియంత్రణపై పలు స్టార్టప్ కంపెనీల్లో ఆమె పనిచేశారు.కాగా అమెరికా దిగువ సభలో ఇప్పటికే భారత సంతతికి చెందిన నలుగురు నేతలు ఉన్నారు.
వారు డాక్టర్ అమి బెరా, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి, ప్రమీలా జయపాల్ ఆ జాబితాలో ఉన్నారు.ఇండో అమెరికన్ కమ్యూనిటీలోనే అత్యంత శక్తివంతులుగా వీరికి పేరు వుంది.
త్వరలో జరగనున్న ఎన్నికల్లో శ్రినా విజయం సాధిస్తే.ప్రతినిధుల సభలో భారతీయుల బలం మరింత పెరిగే అవకాశం వుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.