భారతదేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ మరణ మృదంగాన్ని మోగిస్తోంది.ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని విధంగా ఇక్కడ అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాలు ప్రస్తుతం దేశంలోని పరిస్ధితిని తెలియజేస్తున్నాయి.గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,32,730 మందికి కరోనా పాజిటివ్గా తేలింది.
దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 1,62,63,695కి చేరుకుంది.డబుల్ మ్యుటెంట్తోనే కేసులు పెరుగుతున్నానకుంటే.
దేశంలో థర్డ్ మ్యుటెంట్ కోరలు చాస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.వైరస్ బారినపడిన వారిని రక్షించేందుకు కావాల్సిన మౌలిక సదుపాయాల కొరత దేశాన్ని వేధిస్తోంది.
ఆసుపత్రుల్లో బెడ్లు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ నిండుకున్నాయి.దీంతో ఏం చేయాలో పాలుపోక ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నాయి.
దేశంలో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతున్న సమయంలో దేశ అవసరాలను పక్కనబెట్టి మరి టీకా దౌత్యం పేరిట మోడీ ప్రభుత్వం వ్యాక్సిన్లను విదేశాలకు ఎగుమతి చేసింది.ఇదే సమయంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తొలి నాళ్లలో భారతీయులు టీకా తీసుకోవడానికి భయపడ్డారు.
తీరా వైరస్ విరుచుకుపడే సరికి వ్యాక్సిన్ సెంటర్లకు పరిగెత్తారు.దీంతో డిమాండ్కు తగ్గట్టుగా టీకాలు సరఫరా చేయలేక ఉత్పత్తిదారులు చేతులేత్తేశారు.
వ్యాక్సిన్ కొరతను ఎదుర్కొనేందుకు గాను టీకా అనుమతి ప్రక్రియను మరింత సులభతరం చేసింది కేంద్ర ప్రభుత్వం.సీరమ్ ఇన్స్టిట్యూట్ కోవిషీల్డ్, భారత్ బయోటెక్ కొవాగ్జిన్లకు తోడు రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వికి ఇటీవల భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) ఆమోదం తెలిపింది.
మే 1 నుంచి దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందిస్తామని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే ప్రపంచానికి ఉదారంగా టీకాలు సరఫరా చేసిన భారతదేశం.
ఇప్పుడు ఎవరైనా సాయం చేస్తారా అన్నట్లుగా చూస్తోంది.
ఈ నేపథ్యంలో భారత్కు ఆస్ట్రాజెనెకా టీకాలను అందించి ఆదుకోవాలని అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఓ ఎన్ఆర్ఐ డాక్టర్.న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.ఆస్ట్రాజెనెకా తయారు చేసిన పది లక్షల కోవిడ్ 19 టీకా డోసులు నిల్వ చేసి వున్నాయి.
ఇవి ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నాయి.ఈ డోసులు అనుమతికి సంబంధించిన పరిశీలన జరుగుతోంది.
అయితే ఈ అదనపు డోసులను అత్యవసర స్ధితిలో వున్న దేశాలకు పంపాలని కొందరు వైట్హౌస్, ఫెడరల్ హెల్త్ అధికారులు కోరుతున్నారు.ఇదే సమయంలో ప్రవాస భారతీయుడు ఆశిష్ కే ఝా వ్యాక్సిన్లు అందించాలని ఫెడరల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు ఈయన ట్వీట్ చేశారు.ఆశిష్ బ్రౌన్ విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డీన్గా పనిచేస్తున్నారు.