అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో భారత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం వ్యవహారం అక్కడ దుమారం రేపుతోంది.ఈ ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే పట్టుకుని శిక్షించాలంటూ స్థానిక భారతీయ సమాజం కొద్దిరోజులుగా ఆందోళన నిర్వహిస్తోంది.
ఈ క్రమంలో భారత సంతతికి చెందిన యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు ఆర్వో ఖన్నా ఈ ఘటనను ఖండించారు.దీనిని సిగ్గుపడే చర్యగా అభివర్ణించిన ఆయన అహింస, శాంతియుత నిరసన గాంధీ జీవితం సారాంశమని చెప్పారు.మహాత్ముని విగ్రహం యొక్క పవిత్రతను కాపాడాల్సిన అవసరం వుందని ఖన్నా తెలిపారు.అసమ్మతిని సహనంతో సంయమనంతో ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు.తద్వారా ఏ ఒక్కరూ ప్రజా విధ్వంసక చర్యలకు పాల్పడకుండా వుండేందుకు సమయం కేటాయించాలని ఖన్నా కోరారు. ఇండియా కాకస్ డెమొక్రాటిక్ వైస్ చైర్గా వ్యవహరిస్తున్న ఆయన తన సహచరులతో కలిసి ఇందుకు వారథిగా వుంటానని తెలిపారు.
కాగా, డేవిస్లోని సెంట్రల్ పార్క్ వద్ద గాంధీ విగ్రహం ధ్వంసమైన చోట ఆదివారం రెండు బృందాలు ఆందోళనకు దిగాయి.ఒక వర్గం విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించాలని కోరితే.
మరో గ్రూప్ ఆ చర్యను వ్యతిరేకించింది.మరోవైపు గాంధీ విగ్రహం ధ్వంసంసై డేవిస్ పోలీస్ యంత్రాంగం దర్యాప్తు ప్రారంభించింది.
అంతకుముందు డేవిస్ నగరంలోని సెంట్రల్ పార్క్లో వున్న 6 అడుగుల ఎత్తు, 650 పౌండ్ల బరువున్న మహాత్ముని కాంస్య విగ్రహాన్ని గత వారం ప్రారంభంలో గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.2016లో డేవిస్ సిటీ కౌన్సిల్ నగరంలోని సెంట్రల్ పార్క్లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఆమోదముద్ర వేసింది.గాంధీ వ్యతిరేక, భారత వ్యతిరేక సంస్థల నిరసనల మధ్య భారత ప్రభుత్వం డేవిస్ నగరానికి విరాళంగా ఇచ్చిన గాంధీ విగ్రహాన్ని నాలుగేళ్ల క్రితం నగర కౌన్సిల్ ప్రతిష్టించింది.