కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గత 20 రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు కదం తొక్కుతున్న సంగతి తెలిసిందే.వీరి ఆందోళనలకు మనదేశంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో మద్ధతు పలుకుతున్నారు.
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, బ్రిటన్, అమెరికా ఎంపీలు తమ సంఘీభావం తెలిపారు.తాజాగా ఇండో అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు ఆర్వో ఖన్నా ఈ జాబితాలోకి చేరారు.
భారత్లో రైతుల సమస్యలకు సముచిత పరిష్కారం దొరుకుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.రైతుల మొర ఆలకించాలని ఖన్నా.
భారత ప్రభుత్వానికి సూచించారు.భారత్- అమెరికాల్లో సమస్య ఎలాంటిదైనా శాంతియుతంగా నిరసన తెలుపుకునే సంప్రదాయం వుందని ఆయన గుర్తుచేశారు.
ఇరు దేశాలకు రైతులు వెన్నెముక అని.రైతులు, ప్రభుత్వం మధ్య ఫలప్రదంగా జరగాలని కోరుకుంటున్నానని ఖన్నా ట్వీట్ చేశారు.
మరోవైపు అమెరికాలో రైతులకు మద్ధతుగా సిక్కులు నిర్వహించిన నిరసన ప్రదర్శన ఉద్రిక్తతగా దారి తీసింది.ఖలిస్తానీ వేర్పాటువాదులు ఆందోళన ముసుగులో భారత జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు.
భారత్లో కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అమెరికాలో సిక్కు వర్గానికి చెందిన వారు శనివారం భారీ కార్ల ర్యాలీ నిర్వహించారు.న్యూయార్క్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, ఇండియానా, ఒహైయో, నార్త్ కరోలైనా ప్రాంతాల నుంచి వచ్చిన నిరసనకారులు శాంతియుతంగా రాజధాని వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయానికి చేరుకున్నారు.
వీరి నిరసనల్ని ఆసరాగా చేసుకున్న ఖలిస్థానీ వేర్పాటువాదులు తమ జెండాల్ని చేతబూని ర్యాలీ మధ్యలో దూరారు.చూస్తుండగానే విగ్రహం వద్దకు చేరుకొని ఖలిస్థానీ జెండాతో గాంధీ విగ్రహాన్ని కప్పేసి ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు.ఈ ఘటనను అమెరికాలోని భారత రాయబార కార్యాలయం తీవ్రంగా ఖండించింది.సత్యం, అహింస, శాంతికి ప్రతీకగా భావించే గాంధీజీ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని తప్పుబట్టింది.ఇందుకు సంబంధించిన వివరాల్ని అమెరికా విదేశాంగశాఖకు తెలిపామని పేర్కొంది.మరోవైపు అన్నదాతల పిలుపు మేరకు డిసెంబర్ 14వ తేదీ సోమవారం దేశవ్యాప్తంగా ఆందోళనలు, రైతు సంఘాల నేతల నిరాహార దీక్షలు మొదలయ్యాయి.