ఆధునిక ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పు సైబర్ ఎటాక్.కొందరు హ్యాకర్స్ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల వెబ్సైట్స్, సర్వర్లపై దాడి చేసి విలువైన డేటాను చోరీ చేస్తున్నారు.
వీరి నుంచి డేటాను కాపాడుకోవడం సంస్థలకు పెద్ద తలనొప్పిగా మారింది.ఈ క్రమంలో సైబర్ సెక్యూరిటీపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి.
అలా రీసెర్చ్ చేస్తోన్న ఇండో అమెరికన్ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ బ్రజేంద్ర పాండాకు భారీ రివార్డ్ లభించింది.క్లిష్టమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్పై సైబర్ దాడి జరిగిన తర్వాత రికవరీ పద్ధతులను మెరుగుపరిచేందుకు గాను ఆయనకు నేషనల్ సెంటర్స్ ఆఫ్ అకడమిక్ ఎక్స్లెన్స్ ద్వారా 6,37,223 డాలర్లు (భారత కరెన్సీలో రూ.5.2 కోట్లు) ప్రకటించారు.క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (సీఐ)లో పవర్ గ్రిడ్, గ్యాస్, ఆయిల్ పైప్లైన్, మిలటరీ ఇన్స్టాలేషన్, ఆసుపత్రులు వుంటాయి.
అర్కాన్సాస్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ అయిన పాండాసీఐ సిస్టమ్లు పరస్పరం ఆధారపడటం, అనుసంధానం సైబర్ దాడికి వీలు కలిగిస్తుందని హెచ్చరించారు.
అలాగే ఇతర వ్యవస్థలకు కూడా త్వరగా వ్యాప్తి చెంది నష్టాన్ని కలిగిస్తుందన్నారు. సీఐ సిస్టమ్ల సంక్లిష్టత కారణంగా వాటిని పునరుద్దరించే చర్యల్లో గణనీయమైన జాప్యం జరుగుతుందని పాండా తెలిపారు.
ఇది విద్యుత్ వంటి వ్యవస్థలపై ప్రభావం చూపుతందని ఆయన పేర్కొన్నారు.
క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై జరిగిన దాడికి ఉదాహరణగా గతేడాది కలోనియల్ పైప్లైన్’పై ర్యాన్సమ్వేర్ ఎటాక్ను చెబుతున్నారు నిపుణులు.అమెరికా తూర్పు తీరంలోని కలోనియల్ పైప్లైన్ దేశ ఆర్ధిక వ్యవస్ధకు జీవనాడి వంటిది.టెక్సాస్ నుంచి న్యూజెర్సీ వరకు సుమారు 5,500 కిలోమీటర్ల మేర ఇది చమురు సరఫరా చేస్తూ దేశ ప్రజల అవసరాలు తీరుస్తోంది.
అధికారిక గణాంకాల ప్రకారం ప్రతినిత్యం 25 లక్షల బ్యారళ్ల పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనాన్ని సరఫరా చేస్తుంది.దీనిపై దాడి చేసిన కేటుగాళ్లు ఈ మార్గాన్ని మూసివేశారు.
దీంతో 18 రాష్ట్రాలు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొన్నాయి.ఈ క్రమంలో ఫెడరల్ ప్రభుత్వం రంగంలోకి దిగింది.
రోడ్డు, రైలు, ఇతర మార్గాల ద్వారా చమురును పంపిణీ చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది.తర్వాత సైబర్దాడికి పాల్పడిన వారికి సదరు కంపెనీ 4.4 మిలియన్లను బిట్కాయిన్ రూపంలో చెల్లించింది.