అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జో బైడెన్ తన టీంలో భారతీయులకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ వెళుతున్నారు.ఇప్పటికే వీరి సంఖ్య 30ని దాటిపోయి వుంటుందని అంచనా.
సొంత పార్టీ నుంచి వ్యతిరేకత వస్తున్నా భారతీయుల సత్తాపై నమ్మకం వుంచిన బైడెన్ ముఖ్యమైన విభాగాలకు అధిపతులకు మనవారినే రంగంలోకి దించుతున్నారు.ట్రంప్ హయాంలో కోల్పోయిన అమెరికా ప్రతిష్టను తిరిగి నెలకొల్పడానికి తాను ఏం చేసేందుకైనా సిద్ధమనే భావనను ఆయన అధికారులు, ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
కరోనా, ఆర్ధిక రంగం, వాణిజ్యం, ఇమ్మిగ్రేషన్, పర్యావరణం, విదేశీ విధానం ఇలా తదితర రంగాలపై వేగంగా నిర్ణయాలను తీసుకున్న బైడెన్.గ్రామీణ అమెరికాపై దృష్టి పెట్టారు.
గ్రామీణుల ప్రధాన వృత్తి అయిన వ్యవసాయాన్ని గాడిలో పెట్టడంతో పాటు మరింత లాభసాటిగా మార్చాలని ఆయన ప్రణాళిక రూపొందిస్తున్నారు.
దీనిలో భాగంగా మరో ఇండియన్-అమెరికన్కు కీలక బాధ్యతలను అప్పగించారు బైడెన్.
వాతావరణం, విద్యుత్తు రంగాల్లో నిపుణురాలైన బిడీషా భట్టాచార్యను వ్యవసాయశాఖలోని కీలక స్థానంలో నియమిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేశారు.బిడీషా గతంలో సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రస్లో వాతావరణ, విద్యుత్తు పాలసీ డైరెక్టర్గా పనిచేశారు.
అంతకుముందు విలేజ్ క్యాపిటల్ అనే సంస్థలో ఎమర్జింగ్ మార్కెట్స్ వైస్ ప్రెసిడెంట్గా సేవలందించారు.క్యాపిటల్ హిల్లో మిన్నెసొటా సెనేటర్ అల్ ఫ్రాంకెన్కు సీనియర్ ఎనర్జీ అండ్ అగ్రికల్చర్ పాలసీ అడ్వైజర్గా వ్యవహరించారు.
భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో సౌరశక్తిని వినియోగించేందుకు గాను సింపా నెట్వర్క్స్ అనే స్టార్టప్ కంపెనీతో బిడీషా పనిచేశారు.ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్శిటీలో పబ్లిక్ పాలసీపై మాస్టర్స్, సెయింట్ ఆల్ఫ్ కాలేజ్ నుంచి ఎకనామిక్స్లో బ్యాచ్లర్స్ డిగ్రీని భట్టాచార్య అందుకున్నారు.
మరోవైపు జో బైడెన్ సర్కారు భారత సంతతి నేతలకు కీలక పదవులు ఇవ్వడంతో అమెరికాలోని భారతీయ సంఘాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నయి.ఇక బైడెన్ జట్టులో కమలా హారిస్, నీరా టాండన్, డాక్టర్ వివేక్ మూర్తి, వినయ్ రెడ్డి,వేదాంత్ పటేల్,వనితా గుప్తా, ఉజ్రా జాయే, మాలా అడిగా,గరీమా వర్మ,సబ్రీన్ సింగ్, సమీరా ఫజిలి, భరత్ రామ్మూర్తి తదితరులు చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.