భారత ప్రధాని నరేంద్ర మోడీ నిన్న 72వ వసంతంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.దీంతో బీజేపీ శ్రేణులు శనివారం దేశవ్యాప్తంగా భారీ కార్యక్రమాలను నిర్వహించాయి.
ఇక పార్టీలకతీతంగా పలువురు రాజకీయ నాయకులు, అన్ని రంగాల ప్రముఖులు, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.దీంతో శనివారం సోషల్ మీడియా అంతా మోడీ నామస్మరణతో మారుమోగిపోయింది.
తాజాగా అమెరికాకు చెందిన భారత సంతతి చిన్నారుల బృందం మోడీకి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ పంపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అలాగే కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్లో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ కూడా మోడీ పుట్టినరోజు వేడుకలు నిర్వహించింది.
ఆ సందర్భంగా బీజేపీ అధికార ప్రతినిధి అమన్ సిన్హా మాట్లాడుతూ.ఎనిమిదేళ్ల పాలనలో మోడీ భారతదేశాన్ని మార్చేశారని ప్రశంసించారు.
బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పుల కారణంగా భారతదేశం ప్రపంచ నాయకుడిగా వుండటానికి పునాదులు పడ్డాయన్నారు.రాజకీయాలు, పదవులు పాలించే సాధనాలు కావని, అది ప్రజలకు సేవ చేసే మాధ్యమమని తాము నమ్ముతామని, అదే మనందరికీ స్పూర్తినిస్తుందని అమన్ పేర్కొన్నారు.
ఇకపోతే… తన పుట్టినరోజును పురస్కరించుకుని శనివారం మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లోకి ఎనిమిది చిరుతలను విడిచిపెట్టారు ప్రధాని మోడీ.ప్రాజెక్ట్ చీతాలో భాగంగా ఆఫ్రికాలోని నమీబియా నుంచి ఐదు ఆడ చిరుతలను, మూడు మగ చిరుతలను తీసుకువచ్చారు.
ఇంటర్ కాంటినెంటల్ చీతా ట్రాన్స్లోకేషన్ ప్రాజెక్ట్లో భాగంగా వీటిని గ్వాలియర్ ఎయిర్పోర్టుకు ఎయిర్క్రాఫ్ట్లో తీసుకొచ్చారు.అనంతరం ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన ప్రత్యేక హెలికాఫ్టర్లలో చిరుతలను కునో నేషనల్ పార్క్కి తరలించారు.