అమెరికాలో స్థిరపడిన భారతీయ సమాజం రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే దేశ ఉపాధ్యక్ష పదవితో పాటు సెనేటర్లు, కాంగ్రెస్ సభ్యులు, గవర్నర్లుగా సేవలందిస్తున్న భారతీయులు.
అక్కడి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ దూసుకెళ్తున్నారు.తాజాగా న్యూయార్క్ సిటీ కౌన్సిల్ ఎన్నికల్లో భాగంగా పలువురు బరిలో నిలిచారు.25వ స్థానానికి పోటీపడుతున్న భారతీయ అమెరికన్ కమ్యూనిటీ ప్రముఖుడు, హక్కుల న్యాయవాది శేఖర్ కృష్ణన్ డెమొక్రాటిక్ ప్రైమరీలో దూసుకెళ్తున్నారు.ఫలితాలు అధికారికంగా ప్రకటించబడనప్పటికీ కృష్ణన్ తన ప్రత్యర్ధులపై ఆధిపత్యం చెలాయిస్తున్నట్లుగా తెలుస్తోంది.
కృష్ణన్ ఈ ప్రైమరీలో విజయం సాధిస్తే నవంబర్ 2న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్ధితో తలపడనున్నారు.ప్రైమరీ ఎన్నికలు జూన్ 22న ముగిశాయి.
మరోవైపు భారత్లోని హిమాచల్ ప్రదేశ్ నుంచి విద్యార్ధిగా అమెరికాకు వెళ్లిన సూరజ్ జైస్వాల్ కూడా డిస్ట్రిక్ట్ 25 బరిలో నిలిచారు.ఆయన నవంబర్ 2న జరిగే న్యూయార్క్ సిటీ కౌన్సిల్ ఎన్నికల్లో లిబర్టేరియన్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు.
గత రెండు దశాబ్ధాలుగా న్యూయార్క్ నగరంలో నివసిస్తోన్న తాను గతేడాది వెలుగుచూసిన కరోనా వల్ల జనం ఎంత ప్రభావితమయ్యారనేది చూశానని సూరజ్ అన్నారు.పెరిగిన ఛార్జీలతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందిపడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
ఈ సవాళ్లను అధిగమించి న్యూయార్క్ను సురక్షితమైన నగరంగా మార్చేందుకు కృషి చేస్తానని సూరజ్ స్పష్టం చేశారు.తాను ఎన్నికల్లో విజయం సాధిస్తే.
నగర ప్రజలకు ఉచితంగా ఆరోగ్యకరమైన భోజనాన్ని అందించేందుకు గాను నగర క్యాంటీన్లను ప్రారంభిస్తానని హామీ ఇచ్చారు.
న్యూయార్క్ 23వ జిల్లా నుంచి పోటీపడుతున్న మరో భారతీయ అమెరికన్ అభ్యర్ధి జాస్లిన్ కౌర్ కూడా డెమొక్రాటిక్ నామినేషన్ను గెలుచుకునే ప్రయత్నంలో వున్నారు.
ఆమె ప్రస్తుతం రెండో స్థానంలో వున్నట్లుగా తెలుస్తోంది.పంజాబ్ నుంచి అమెరికాకు వలస వచ్చిన కుటుంబానికి చెందిన మహిళ జాస్లిన్ కౌర్.ఇక డెమొక్రాటిక్ ప్రైమరీని గెలుచుకునేందుకు మరికొందరు భారతీయ అమెరికన్లు కూడా తహతహలాడుతున్నారు.న్యూయార్క్ 26వ జిల్లా నుంచి అమిత్ బగ్గా, 32వ జిల్లా నుంచి ఫెలిసియా సింగ్ బరిలో నిలిచారు.