అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి భారతీయులకు తన జట్టులో కీలక పదవులు కట్టబెడుతూ వచ్చారు జో బైడెన్.నానాటికీ ఈ సంఖ్య పెరుగుతూనే వుంది.
తాజాగా మరో ఇండో అమెరికన్ను కీలక పదవికి నామినేట్ చేశారు బైడెన్.భారత సంతతికి చెందిన అరుణ్ వెంకటరామన్ను అమెరికా, విదేశీ వాణిజ్య సేవల డైరెక్టర్ జనరల్గా బుధవారం అధ్యక్షుడు నామినేట్ చేశారు.
అలాగే గ్లోబల్ మార్కెట్స్ అసిస్టెంట్ సెక్రటరీగానూ వెంకటరామన్ను నియమించే యోచనలో బైడెన్ ఉన్నట్లు తెలుస్తోంది.యూఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్లో లా క్లర్క్గా కెరీర్ ప్రారంభించిన వెంకటరామన్ .గడిచిన 20ఏళ్లుగా ఎన్నో కంపెనీలు, అంతర్జాతీయ సంస్థలతో పాటు వాణిజ్య సమస్యలపై అమెరికా ప్రభుత్వానికి వెంకటరామన్ సలహాదారుగా ఉన్నారు.ప్రస్తుతం ఆయన అమెరికా వాణిజ్య కార్యదర్శికి కౌన్సిలర్గా, వాణిజ్య విభాగానికి, ఇతర అంతర్జాతీయ ఆర్థిక విషయాలపై సలహాదారుగా వ్యవహరిస్తున్నారు.
అంతకుముందు వీసా విభాగంలో వెంకటరామన్ సీనియర్ డైరెక్టర్గా విధులు నిర్వహించారు.
ఆయన కొలంబియా లా స్కూల్ నుండి జేడీ, ఫ్లెచర్ స్కూల్ ఆఫ్ లా అండ్ డిప్లొమసీ నుండి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ లా అండ్ డిప్లొమసీ చేశారు.
అంతేకాకుండా టఫ్ట్స్ యూనివర్సిటీ నుంచి బీఏ పట్టా కూడా పొందారు.యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యుఎస్టిఆర్) కార్యాలయంలో యుఎస్-ఇండియా వాణిజ్య విధానం అభివృద్ధి, అమలుకు సంబంధించి వెంకటరామన్ నాయకత్వం వహించారు.
అత్యుత్తమ పనితీరు, అసాధారణ నాయకత్వానికి గాను ఆయన ప్రతిష్టాత్మక కెల్లీ అవార్డును అందుకున్నారు.
బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా వున్న సమయంలో అంతర్జాతీయ వాణిజ్య పరిపాలన విభాగంలో తొలిసారిగా వెంకటరామన్ పాలసీ డైరెక్టర్గా విధులు నిర్వర్తించారు.ఆ సమయంలో చైనా, భారత్తో పాటు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లలో క్లిష్టమైన సవాళ్లకు ప్రతిస్పందనలను రూపొందించడంలో అమెరికా ప్రభుత్వానికి ఆయన సహాయపడ్డారని వైట్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది.