అమెరికాలో ఓ భారత సంతతి మహిళ తన కన్నబిడ్డను అత్యంత కిరాతకంగా గొంతుకోసి హత్య చేసింది.టెక్సాస్ రాష్ట్రంలో షుగర్లాండ్లో నివసిస్తున్న రితికా రోహిత్గి అగర్వాల్ అనే మహిళ తన నాలుగేళ్ల కుమారుడిని శనివారం కత్తితో గొంతు కోసి చంపింది.
భర్త ఇంట్లో లేని సమయంలో రితికా ఈ దారుణానికి పాల్పడింది.హత్య అనంతరం చిన్నారి మృతదేహాన్ని వారు నివసిస్తున్న అపార్ట్మెంట్లోని సెకండ్ ఫ్లోర్లో పడేసింది.
అయితే బయట పని ముగించుకుని ఇంటికొచ్చిన రితిక భర్త ఇంట్లోని రక్తపు మరకలు చూసి షాకయ్యాడు.భార్య ఒంటిపై గాయాలు, రక్తపు మరకలు కనిపించాయి.రక్తపు మరకలను అనుసరిస్తూ వెళ్లగా సెకండ్ ఫ్లోర్లో కుమారుడి మృతదేహం కనిపించడంతో అతను కన్నీటి పర్యంతమయ్యాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాబు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.రితిక చేతి మణికట్టు, మెడపై కత్తితో కోసిన గాయాలు గమనించిన పోలీసులు.వీటిని ఆమె తనకు తానుగా చేసుకున్నవిగా గుర్తించారు.
వెంటనే నిందితరాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.కాగా మానసిక సమస్యల కారణంగానే రితిక ఈ ఘాతుకానికి పాల్పడి వుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
నిందితురాలిని ఫోర్ట్ బెండ్ కౌంటీ మేజిస్ట్రేట్ ముందు హాజరరుపరచగా ఆయన రితికాకు 9,50,000 డాలర్ల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు.