సిక్కు వేర్పాటువాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ఖలిస్తాన్ కోసం ఇప్పటికే కెనడాలో రెఫరెండం నిర్వహించిన సంగతి తెలిసిందే.అయితే ఈసారి కెనడాలో కాకుండా ఆస్ట్రేలియాలో కావడం గమనార్హం.ఆ దేశ రాజధాని కాన్బెర్రాలో తదుపరి రౌండ్ ఖలిస్తాన్ ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందని సిక్స్ ఫర్ జస్టిస్ వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ ప్రకటించారు.తాజాగా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో భారతీయ కమ్యూనిటీ కోసం జరిగిన కార్యక్రమంలో ఖలిస్తానీ జెండాలు కలకలం రేపాయి.
దీనిపై సమాచారం అందుకున్న భారత ప్రభుత్వం ఉలిక్కిపడింది.ఇప్పటి వరకు కెనడాకు మాత్రమే పరిమితమైన ఖలిస్తానీ ఉద్యమం ఆస్ట్రేలియాలోనూ పెరుగుతుండటం కలవరపాటుకు గురిచేస్తోంది.
ఈ నేపథ్యంలో దీనిపై ఆసీస్ ప్రభుత్వాన్ని భారత అధికారులు హెచ్చరించినట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.క్వాడ్ దేశాధినేతల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరే ముందు ఈ ఘటన జరగడం గమనార్హం.
భారతీయ కమ్యూనిటీ కోసం ఆస్ట్రేలియన్ ప్రభుత్వం స్పాన్సర్ చేసిన ఈ కార్యక్రమం నవంబర్ 19న మెల్బోర్న్లో జరిగింది.ఈ ఈవెంట్లో పెద్ద సంఖ్యలో ఖలిస్తానీ జెండాలు గాల్లో ఎగరడంతో భారత ప్రభుత్వ ఉన్నతాధికారులు.
ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, హోం వ్యవహారాల శాఖ మంత్రి క్లైర్ ఓ నీల్ను అప్రమత్తం చేసినట్లుగా తెలుస్తోంది.ఖలిస్తాన్ ఉద్యమానికి మెల్బోర్న్లో పెరుగుతున్న మద్ధతుపై భారత వర్గాలు ఆందోళన వ్యక్తం చేసినట్లుగా ది ఆస్ట్రేలియన్ వార్తాసంస్థ నివేదించింది.1980లలో భారతదేశంలో జరిగిన ఖలిస్తాన్ ఉద్యమానికి తీవ్రవాదం, హింసాత్మక చరిత్ర వుందని అధికారులు… ఆస్ట్రేలియా మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు.అలాగే తీవ్రవాదం కారణంగా ప్రభావితమైన వేలాది మంది సిక్కులు… ఆస్ట్రేలియా, కెనడా, యూఎస్, యూకే సహా ఆంగ్లో ఫోనిక్ దేశాలకు వలస వెళ్లారని వారు గుర్తుచేశారు.
అక్కడ స్థిరపడిన అనేకమంది వేర్పాటువాదులు యువతను ఉద్యమం వైపు ఆకర్షిస్తున్నారని భారత అధికారులు పేర్కొన్నట్లు ది ఆస్ట్రేలియన్ తెలిపింది.
ఇదిలావుండగా.పంజాబ్లో ఉగ్రవాద దాడులకు పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ మద్దతిస్తోందని భారత నిఘా సంస్థల వద్ద ఆధారాలున్నాయి.బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్, ఖలిస్తాన్ కమాండో ఫోర్స్, ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్, ఇంటర్నేషనల్ సిక్కు యూత్ ఫెడరేషన్, సిక్స్ ఫర్ జస్టిస్ వంటి భారత్ నిషేధించిన టెర్రరిస్టు గ్రూపులకు చెందిన పలువురు వ్యక్తులు పలు దేశాల్లో ఆశ్రయం పొందుతున్నారని భారత అధికారులు చెబుతున్నారు.