కరోనా కారణంగా విధించిన లాక్డౌన్తో మనిషి నాలుగు గోడల మధ్య బందీ అయ్యాడు.వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వెళ్లిన వారు ఎక్కడికక్కడే చిక్కుకుపోయారు.
పరాయి దేశం పొమ్మంటుంటే.అటు స్వదేశానికి వెళ్లేందుకు విమానాలు లేక ఎంతో మంది భారతీయులు నలిగిపోయారు.
ఎప్పుడూ కలలో కూడా ఊహించని ఎన్నో సంఘటనలు గతేడాది జరిగాయి.అయితే భారత ప్రభుత్వం వందే భారత్ ఎక్స్ప్రెస్ పేరుతో ప్రత్యేక విమానాలు నడిపి లక్షలాది మంది ప్రవాసుల్ని స్వదేశానికి తీసుకొచ్చింది.2020, మే 6న 64 విమానాలు, 12,800 మంది ప్రయాణికులతో ‘వందే భారత్ మిషన్’ ప్రారంభమైంది.నాటి నుంచి మార్చి 2 వరకు దాదాపు 60 లక్షల మంది ప్రవాసుల్ని స్వదేశానికి తీసుకువచ్చామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు.
అటు భారత్లోని భయానక పరిస్ధితుల నేపథ్యంలో అక్కడి వేరియెంట్ తమ దేశంలో ప్రవేశించకుండా పలు దేశాలు విమాన ప్రయాణాలు నిషేధించాయి.ఈ క్రమంలో ఆస్ట్రేలియా విధించిన నిషేధం ఎన్ని విమర్శలకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్కనక్కర్లేదు.
హద్దు మీరి స్వదేశంలో అడుగు పెడితే జైలు శిక్షతో పాటు లక్షల రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు.ఆ నిషేధం ముగిసిందనుకోండి.ఈ సంగతి పక్కనబెడితే… గల్ఫ్ దేశాలు సైతం భారత్పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.దీంతో వివిధ పనులపై గల్ఫ్ నుంచి భారత్కు వచ్చినవారు.
గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు రావాల్సిన వారు చిక్కుకుపోయారు.ఇక తప్పనిపరిస్థితుల్లో వెళ్లాల్సిన వారు ప్రైవేట్ విమానాలను ఆశ్రయిస్తున్నారు.
ఇది భారీ వ్యయంతో కూడుకున్నది కావడంతో సంపన్నులు తప్ప.సామాన్యులు అటువైపు తొంగి చూడటం లేదు.
మొన్నామధ్య తల్లిని చూడటానికి యూఏఈ నుంచి వచ్చిన ఓ ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త భార్యాబిడ్డలతో భారత్లో చిక్కుకుపోయారు.దీంతో ఆయన తిరిగి దుబాయ్ వెళ్లేందుకు గాను అక్షరాల రూ.55 లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది.
భారత్లోని పరిస్ధితుల నేపథ్యంలో ఇక్కడి నుంచి వచ్చే విమానాలపై గతంలో విధించిన నిషేధాన్ని యూఏఈ జూన్ 30 వరకు పొడిగించింది.అయితే దౌత్యవేత్తలు, వారి కుటుంబ సభ్యులు, యూఏఈ గోల్డెన్ వీసా కలిగిన వారు, యూఏఈ పౌరులకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపునిచ్చింది.ఈ వెసులుబాటు కారణంగా గోల్డెన్ వీసా కలిగిన రెండు భారతీయ కుటుంబాలతో ఏమిరేట్స్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం కొచ్చి నుంచి దుబాయ్కి ప్రయాణించింది.నడాపూరంకు చెందిన యూనస్ హుస్సెన్ కుటుంబంతో పాటు కొచ్చికి చెందిన మరో ఫ్యామిలీ ఈ విమానంలో ప్రయాణించాయి.360 మంది ప్రయాణికులను మోసుకెళ్లగల సామర్థ్యం వున్న ఈ విమానంలో కేవలం ఈ రెండు ఫ్యామిలీలు మాత్రమే వెళ్లడం విశేషం.దుబాయ్ ప్రయాణానికి గాను ఈ రెండు కుటుంబాలు రూ.1.80 లక్షలు ఖర్చు చేశాయి.