ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ ఏ విధంగా ఉగ్రరూపం దాలుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రతిరోజు మన దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయే తప్పించి తగ్గడం కుదరట్లేదు.
ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఈ తీవ్రత మరింతగా ఉధృతంగా మారుతోంది.గత వారం రోజుల నుంచి భారతదేశంలో రోజుకు సరాసరి 60 వేల కేసులు పైగా నమోదవుతున్నాయి.
దేశం లో మహారాష్ట్ర, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో కరోనా పంజా కొనసాగతోంది.
ఇకపోతే ప్రస్తుతం కరోనా వైరస్ బాధితుల సంఖ్య భారతదేశంలో 24 లక్షల కు చేరువలో ఉంది.
ఇప్పటికే భారతదేశం ప్రపంచంలో అత్యధిక కరోనా వైరస్ కేసులు కలిగి ఉన్న లిస్టులో మూడో స్థానాన్ని పొందింది.ఇక తాజాగా కోవిడ్ 19 సంబంధిత మరణాల విషయంలో కూడా మరో ఘనతను సాధించింది భారత్.
తాజా గణాంకాల ప్రకారం భారతదేశం కోవిడ్ 19 మరణాల సంఖ్యలో ప్రపంచ దేశాలలో నాలుగో స్థానానికి చేరుకుంది.ఇదివరకు 4వ స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ దేశాన్ని భారతదేశం వెనక్కి నెట్టి ఆ స్థానాన్ని ఆక్రమించింది.
ఇదివరకు ఇంగ్లాండ్ దేశంలో మరణాల సంఖ్య 46,705 గా ఉండగా, తాజాగా భారతదేశంలో మరణాల సంఖ్య 47,033 కు చేరుకోవడంతో ఆ స్థానాన్ని ఆక్రమించింది.ఓవైపు మనదేశంలో రికవరీ శాతం ఎక్కువ గానే ఉన్నా, మరోవైపు అన్ని రాష్ట్రాల్లో కలుపుకొని మరణాల సంఖ్య రోజురోజుకి మరింతగా పెరుగుతోంది.ఏది ఏమైనా ఈ కరోనా వైరస్ దెబ్బతో ప్రపంచం మొత్తం అతలాకుతలమైంది.అనేక మంది కరోనా వైరస్ బారినపడి మృతి చెందగా… చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి మానసిక వేదనతో మరణించిన వారు కూడా ఎందరో ఉన్నారు.