ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా, అత్యధిక యువశక్తి ఉన్న దేశంగా భారతదేశం గుర్తింపు పొందింది.అలాగే అభివృద్ధి, టెక్నాలజీ, శ్రామికశక్తిలో అగ్రదేశాలకి పోటీ ఇస్తూ అభివృద్ధిలో పరుగులు పెడుతుంది.
యువశక్తితో, శ్రామిక శక్తి ఎక్కువగా ఉండటం వలన ఇండియాలో కంపెనీలు పెట్టడానికి పెద్ద పెద్ద సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి.అలాగే ప్రపంచంలో చైనా తర్వాత అతి పెద్ద మార్కెట్ ఉన్న ఉన్న దేశం కూడా ఇండియానే అందుకే ఇక్కడ పెట్టుబడులు పెడితే దేశీయ మార్కెట్ తో ఆదాయం పెంచుకోవచ్చని కార్పోరేట్ కంపెనీలు భావిస్తున్నాయి.
ఆడంబరాలకి ప్రాధాన్యత ఇచ్చే ఇండియాలో కొత్తగా ఉండే ప్రతి వస్తువుకి డిమాండ్ ఉంటుంది.వీటన్నింటికి ఇండియాకి ఉన్న ప్రధాన బలం యువశక్తి.
అయితే ఇండియాలో ఈ యువశక్తి మరో 16 ఏళ్ళు మాత్రమే ఉంటుందని ఓ అధ్యయనంలో తెలిసింది.అత్యధిక యువశక్తితో తులతూగుతున్న భారతదేశం 2036నాటికి వృద్ధభారతం అవుతుందని లెక్కలు చెబుతుంది.2011 జనాభా లెక్క ప్రకారం దేశంలో 0-24 ఏండ్ల మధ్య వయస్కులు 50.2శాతం ఉన్నారు.2036నాటికి ఇది 25.3శానికి పడిపోతుందని జనాభాపై అధ్యయనానికి ఏర్పడిన సాంకేతిక బృందం తన నివేదికలో వెల్లడించింది.జననాల రేటు గణనీయంగా తగ్గటం, అలాగే ప్రజల జీవితకాలం పెరుగటం కూడా దేశంలో వృద్ధుల సంఖ్య పెరుగటానికి మరో కారణం అవుతుందని పేర్కొంది.2011 లెక్కల ప్రకారం దేశ జనాభాలో 60 ఏండ్లు పైబడినవారు 8.4శాతం ఉండగా, 2036నాటికి అది 14.9శాతానికి పెరుగుతుంది అని ఆ అధ్యయనంలో అంచనా వేశారు.ఈ అధ్యయనం నిజం అయితే భారత్ తన యువశక్తిని ఉపయోగించుకొని అగ్రదేశాల జాబితాలోకి చేరడానికి మరో 15 ఏళ్ళు మాత్రమే అవకాశం ఉన్నట్లు.దీనిని భారత ప్రభుత్వం ఎంత వరకు ఉపయోగించుకుంటుంది అనేది చూడాలి.