ప్రస్తుతం ఈ భూమ్మీద ఎక్కడ చూసినా కరోనా మహమ్మారి ప్రభావమే కనిపిస్తోంది.ఊపిరాందక రోగుల అవస్థలు.
ప్రాణాలు కోల్పోయిన వారి బంధువుల రోదనలు, క్షణం ఖాళీ లేకుండా మండుతున్న దహన వాటికలే.అమలాపురం నుంచి అమెరికా దాకా ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు.
కరోనా మహమ్మారి మనుషుల ప్రాణాలను తీయడంతో పాటు దేశా ఆర్ధిక వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేస్తోంది.ఫలితంగా దీని ప్రభావం అన్ని రంగాల మీద పడి కోట్లాది మంది ఉపాధి లేక రోడ్డున పడ్డారు.
తద్వారా పరోక్షంగా ఆకలి చావులకు కరోనా కారణమవుతోంది.ఆర్ధిక వేత్తల అంచనాలను బట్టి ఇప్పుడప్పుడే ఆర్ధిక వ్యవస్థ గాడినపడే అవకాశం లేదట.
ఇక భారత్లో కరోనా విలయతాండవం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.రోజురోజుకు పెరుగుతున్న కేసులు, మరణాలతో ఇండియా పరిస్ధితి హృదయ విదారకంగా వుంది.
అసలే రెండో దశను ఎదుర్కోలేక చేతులెత్తేస్తున్న నేపథ్యంలో థర్డ్ వేవ్ తప్పదంటూ నిపుణుల హెచ్చరికల దరిమలా ప్రభుత్వాలు, ప్రజలు భయాందోళలనలకు గురవుతున్నారు.దయనీయ పరిస్ధితుల వేళ ప్రవాస భారతీయులు పలు రకాలుగా మాతృదేశాన్ని ఆదుకునేందుకు ముందుకొస్తున్నారు.
ఇప్పటికే వ్యక్తిగతంగా విరాళాలు ప్రకటించడంతో పాటు స్వచ్చంద సంస్థల ద్వారా చేయూతనందిస్తున్నారు.ఆక్సిజన్, వెంటిలేటర్లు, మందులు, ఇతర వైద్య పరికరాలను సమీకరించి భారత్కు పంపుతున్నారు.
ఇక మరో రకంగానూ జన్మభూమిని ఆదుకుంటున్నారు ఎన్ఆర్ఐలు.ఆర్ధిక పరిస్ధితులు తలక్రిందులై, ఉద్యోగాలు పోతున్న పరిస్ధితుల్లోనూ విదేశాల్లోని భారత ప్రవాసులు భారీగా నగదును స్వదేశానికి పంపించినట్లు ప్రపంచ బ్యాంక్ నివేదిక తెలియజేస్తోంది.గతేడాది విదేశాల్లోని ప్రవాసుల నుంచి ఇండియాకు 83 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.6.11 లక్షల కోట్లు) చేరినట్లు ప్రపంచ బ్యాంక్ రిపోర్ట్ పేర్కొంది.అంతకుముందు ఏడాది (2019)తో పోలిస్తే ఇది 0.2శాతం తక్కువ.అయినా ప్రవాసుల సొమ్మును అత్యధికంగా అందుకుంటున్న దేశాల జాబితాలో భారత్ అగ్రస్థానంలో నిలవడం విశేషం.మనదేశం తర్వాతి స్థానాల్లో చైనా (59.5 మిలియన్లు), మెక్సికో(42.8 బిలియన్లు), ఫిలిప్పీన్స్(34.9 బిలియన్లు), ఈజిప్ట్(29.6 బిలియన్లు), పాకిస్థాన్ (26 బిలియన్లు), ఫ్రాన్స్(24.4 బిలియన్లు), బంగ్లాదేశ్(21 బిలియన్లు) ఉన్నాయి.
కాగా, ఇటీవల విదేశీ-మారక నిల్వల్లో రష్యాను అధిగమించి ప్రపంచంలో నాలుగో అతి పెద్ద విదేశీ మారక నిల్వలు కలిగిన దేశంగా భారత్ అవతరించిన సంగతి తెలిసిందే.అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రకారం విదేశీ మారక నిల్వల్లో మొదటి స్థానంలో చైనా ఉండగా, తరువాతి స్థానాల్లో జపాన్ , స్విట్జర్లాండ్ ఉన్నాయి.నాలుగో స్థానంలో వున్న భారత్ దగ్గర సుమారు 580.3 బిలియన్ డాలర్ల నిల్వలు వున్నాయి.