ప్రపంచ కప్ మొదలైన తరువాత అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్ ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్.ఈ మ్యాచ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఆ రోజు రానే వచ్చింది.
ప్రపంచ కప్ లో ఇండియా-పాక్ మ్యాచ్ అనగానే ప్రతి అభిమాని కూడా ఎంతో ఉత్కంఠంగా మ్యాచ్ ని తిలకిస్తూ ఉంటాడు.యావత్ క్రికెట్ ప్రపంచం ఏంతో ఆసక్తిగా చూసే హై ఓల్టేజ్ మ్యాచ్ ఇదే.మరి కొద్దీ గంటల్లో ప్రారంభంకాబోయే ఈ మ్యాచ్ కోసం అభిమానులు అప్పుడే టీవీల మందు ఎదురుచూస్తున్నారు.వరల్డ్ కప్ మెగా టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.
వరుణుడు కరుణిస్తే నరాలు తెగే ఉత్కంఠ సన్నివేశాలకు.ఉద్వేగ భరిత దృశ్యాలకు ఖాయమే అంటున్నారు అభిమానులు.
అయితే మరోపక్క జట్ల కూర్పు విషయానికి వస్తే బ్యాటింగ్ ఆర్డర్, పేస్ బౌలింగ్, ఆల్రౌండర్ల కాంబినేషన్తో భారత్ బలంగా కనిపిస్తోంది.జట్టు లో ధావన్ లేకపోయినప్పటికీ అతని స్థానం లో సీనియర్ దినేష్ కార్తీక్ కు అవకాశం లభిస్తుందో,లేదంటే ఆల్ రౌండర్ అయిన విజయ్ శంకర్ కు అవకాశం దక్కుతుందో చూడాలి.
అలానే బ్యాటింగ్ లో ఇప్పటివరకు కోహ్లీ,రోహిత్,ధోని,హార్దిక్ పాండ్యా లు మంచి ఫామ్ లో ఉండడం కూడా టీమిండియాకు ప్లస్ పాయింట్స్ గానే చెప్పాలి.ఇక బౌలింగ్ విషయానికి వస్తే బౌలర్లు కూడా ఎవరికీ వారు తమ స్థాయి కి తగ్గ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు.
దీనితో టీమిండియా కు విజయావకాశాలు మెండుగా ఉన్నాయి.మరోపక్క ఇప్పటి వరకూ వరల్డ్కప్లో భారత్ను బోల్తా కొట్టించలేకపోయిన పాక్.ఈ సారైనా విజయాన్ని అందుకోవాలని కుతూహలంగా ఉంది.అందులోనూ భారత్ తో మ్యాచ్ అనగానే పాక్ టీమ్ విజయం కోసం తెగ ఉవ్విళ్ళూరుతుంది.పాక్ బ్యాట్స్మెన్లో ఇమామ్ ఉల్ హఖ్, బాబర్ ఆజమ్ మంచి ఫామ్లో ఉన్నారు.కొత్త పేసర్ షాహిన్ ఆఫ్రిదితోపాటు స్టార్ బౌలర్ ఆమిర్లపై ఆ జట్టు బోలెడు ఆశలు పెట్టుకుంది.
దానికి తోడు ఈ టోర్నీ లో ఫెవరెట్ టీమ్ గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ను ఓడించిన ఒక ఉత్సాహం లో పాక్ భారత్ తో తలపడనుంది.దీనితో ఎలా అయినా విజయాన్ని అందుకోవాలని చూస్తుంది.
అయితే ఈ మ్యాచ్ కు వరుణుడు అడ్డంకిగా మారతాడా లేదా అన్నది మరికొద్ది సేపటిలో తెలుస్తుంది.