కరోనా నేపథ్యంలో కొందరు సాగిస్తున్న సాహసయాత్రలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది.ముఖ్యంగా వలస కూలీలు చేస్తున్న జీవన పోరాటం, వారు సాగిస్తున్న సుదీర్ఘ ప్రయాణం కొన్ని కోట్ల మందికి కన్నీరు పెట్టించిన సంఘటనలు ఈమద్య కాలంలో చాలానే ఉన్నాయి.
ఇటీవలే ఒక తల్లి తన కొడుకును తీసుకు వచ్చేందుకు ఒంటరిగా స్కూటీపై దాదాపుగా ఏడు వందల కిలోమీటర్ల ప్రయాణం చేసింది.ఇక తన భార్యతో ఒక వ్యక్తి చేసిన ప్రయాణం గురించి విన్నాం.
తాజాగా మహేష్ అనే వ్యక్తి సైకిల్పై ఏకంగా రెండు వేల కిలో మీటర్లు ప్రయాణించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒడిశాకు చెందిన మహేష్ జెనా అనే వ్యక్తి మహారాష్ట్రలోని సంగ్లి మిరాజ్ ప్రాంతంలో ఒక ఫ్యాక్టరీలో పని చేస్తూ ఉండేవాడు.లాక్ డౌన్ నేపథ్యంలో కంపెనీ మూతపడినది.లాక్డౌన్ తర్వాత కంపెనీ తెరిచే పరిస్తితి లేదని, కనీసం అయిదు ఆరు నెలల పాటు కంపెనీ మూసే ఉంటుందని తెలియడంతో తన సొంత ప్రాంతంకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.
అయితే ఎక్కడ కూడా చిన్న వాహనం కూడా వెళ్లేందుకు లేకపోవడంతో సైకిల్పై వెళ్లాలనే నిర్ణయానికి వచ్చాడు. తెలిసిన వ్యక్తి వద్ద 1200 రూపాయలతో సైకిల్ కొనుగోలు చేసి 500 రూపాయలతో దాన్ని మరమత్తులు చేయించి తన ప్రయాణం మొదలు పెట్టాడు.
ప్రతి రోజు ఉదయం 4 గంటల సమయంలో ప్రయాణం మొదలు పెట్టి ఎండకు ఆగుతూ నీడకు సైకిల్ తొక్కుతూ రోజులో 100 నుండి 125 కిలో మీటర్ల మేరకు ప్రయాణం చేసేవాడు.ఆ ప్రయాణంలో అతడు తిన్నది చాలా తక్కువ.ఎక్కడైనా ఉచిత బోజనం ఉందని తెలిస్తే లేదంటే ఎవరైనా సాయం చేస్తే తినేవాడు.అతడు షోలాపూర్, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం మీదుగా ఒడిశాలో చేరాడు.కొన్ని వందల చోట్ల అతడిని పోలీసులు ఆపేశారు.
అతడి ప్రయాణం గురించి తెలిసి పోలీసులు కొన్ని చోట్ల ఆహారం ఇచ్చి మరీ పంపించారట.
పలు చోట్ల పోలీసులు ఇచ్చిన ఆహారం తిని తన ప్రయాణం సాగించానంటూ మహేష్ చెప్పాడు.ఒడిశా చేరుకున్న అతడిని ప్రస్తుతం క్వారెంటైన్లో అధికారులు ఉంచారు.అతడి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు.