బ్రిటన్లో వెలుగు చూసిన కొత్త రకం వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికి అనుభవిస్తున్నది చాలదన్నట్లు.
స్ట్రెయిన్ తమ కొంప ఎక్కడ ముంచుతుందోనని అన్ని దేశాలు యూకే నుంచి వచ్చే విమానాలను, వెళ్లే విమానాలను నిషేధించాయి.అటు భారత ప్రభుత్వం సైతం బ్రిటన్కు విమాన రాకపోకలను నిషేధించింది.
ప్రస్తుతం దేశంలో పరిస్థితుల నేపథ్యంలో యూకే ప్రయాణాలపై విధించిన నిషేధాన్ని భారత ప్రభుత్వం జనవరి 7 వరకు పొడిగించింది.ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరీ బుధవారం ప్రకటించారు.
జనవరి 7 తర్వాత సర్వీసులను పునరుద్ధరించినా అది కఠిన ఆంక్షలతో కూడుకున్నదై ఉంటుందని, దీనికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పూరీ చెప్పారు.
అంతకుముందు స్ట్రెయిన్ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా భారత్-బ్రిటన్ మధ్య డిసెంబర్ 23 నుంచి 31 వరకు విమాన సేవలను భారత్ తాత్కాలికంగా నిషేధించిన సంగతి తెలిసిందే.
అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.యూకే నుంచి భారత్ వచ్చిన వారిలో పలువురికి కొత్త స్ట్రెయిన్ సోకినట్లు తేలింది.బుధవారం నాటికి దేశంలో కొత్త స్ట్రెయిన్ కేసుల సంఖ్య ఇరవైకి పెరిగింది.
యూకే నుంచి వచ్చిన వారి రక్త నమూనాలను హైదరాబాద్ సీసీఎంబీ సహా అనేక ప్రయోగశాలల్లో మొత్తం 107 శాంపిళ్లను విశ్లేషించారు.సీసీఎంబీలో పరిశీలించిన శాంపిళ్లలో ఇద్దరికి వైరస్ సోకినట్టు నిర్ధారణ కాగా, ఢిల్లీ తొమ్మిది, బెంగళూరులో ఏడు, హైదరాబాద్లో రెండు, కోల్కతాలో ఒకటి, పూణెలో ఒక్కొ కేసు నమోదయ్యాయి.కొత్త స్ట్రెయిన్ సోకిన వారిని ప్రత్యేక గదుల్లో ఐసొలేషన్లో ఉంచారు పరిశోధకులు.
అయితే ఇప్పుడు బాధితుల ప్రైమరీ కాంటాక్ట్స్ గుర్తించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారులు రంగంలో దిగారు.నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 వరకూ యూకే నుంచి 33,000 ప్రయాణికులు భారత్కు వచ్చినట్లు కేంద్రం గుర్తించింది.
వీరందరినీ గుర్తించి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్రాలు చర్యలు ప్రారంభించాయి.