భారత్- చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పట్లో పరిష్కారమయ్యే సూచనలు కనిపించడం లేదు.ఇండియా ఎంతటి సంయమనంగా వ్యవహరిస్తున్నా డ్రాగన్ మాత్రం కవ్వింపు చర్యలకు దిగుతూనే వుంది.
దాదాపు ఐదు నెలల నుంచి ఇదే తంతు కొనసాగుతోంది. ఎల్ఏసీ ఒప్పందాలను ఉల్లంఘిస్తూ భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు చైనా ఎడతెగని ప్రయత్నాలు చేస్తోంది.
అటు భారత్-చైనాల మధ్య జరుగుతున్న పరిణామాలను అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా గమనిస్తోంది.ఈ నేపథ్యంలో చైనా తన కవ్వింపు చర్యలను విడనాడాలని కోరారు భారత సంతతి అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి.
భారత్- చైనాల మధ్య ఉద్రిక్తతలను గురించి చర్చించేందుకు గాను అమెరికా హౌస్ పర్మినెంట్ సెలక్ట్ కమిటీ ఆన్ ఇంటెలిజెన్స్ తొలిసారిగా సమావేశమైంది.ఇందులో రాజా కృష్ణమూర్తి సభ్యుడు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుడూ.ఇండో – చైనా బోర్డర్లో ఘర్షణలు తీవ్ర విచారకరమన్నారు.
భారత్పై చైనా దూకుడును తగ్గించుకోవాలని తాను రూపొందించిన ద్వైపాక్షిక తీర్మానానికి సభ ఆమోదం లభించిందని కృష్ణమూర్తి చెప్పారు.రెండు దేశాల మధ్య నెలకొన్న వివాదానికి పూర్తి పరిష్కారం లభించే వరకు ఆ అంశాన్ని తాను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటానని ఆయన స్పష్టం చేశారు.
భారత సంతతికి చెందిన రాజా కృష్ణమూర్తి 2017 నుంచి డెమొక్రాటిక్ పార్టీ తరపున అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో ఇల్లినాయిస్ రాష్ట్ర ప్రతినిధిగా ఉన్నారు.