తమ ఉద్యోగాలు తన్నుకుపోతున్నారనో లేదంటే.తమకన్నా ప్రతిభావంతులన్న అసూయో తెలియదు కానీ వివిధ దేశాల్లో స్థిరపడిన భారతీయులు అక్కడి స్థానికుల చేతుల్లో జాత్యహంకార దాడులకు గురవుతున్నారు.
ఇప్పటి వరకు ఈ తరహా సంఘటనలు కొన్ని వేలు జరిగాయన్నది బహిరంగ రహస్యం.ఇదే సమయంలో వెలుగులోకి రాని సంఘటనలు లెక్కకు మిక్కిలిగా ఉంటాయి.
తాజాగా అమెరికాలో మరోసారి జాత్యహంకార బెదిరింపుల ఘటన కలకలం రేగింది.
స్వదేశానికి తిరిగి వెళ్లకపోతే కాల్పులకు దిగుతామంటూ టెక్సాస్లోని ఓ కుటుంబానికి గుర్తు తెలియని దుండగులు మెయిల్ ద్వారా బెదిరింపు లేఖ పంపారు.
ఐటీ పరిశ్రమతో పాటు ఇతర రంగాల్లో ఉన్న భారతీయుల, చైనీయుల కారణంగా అమెరికా పౌరులు ఉద్యోగాలు కోల్పోతున్నారని.మీరంతా తక్షణం తమ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లాలని సదరు లేఖలో కోరారు.
లేని పక్షంలో మీరు పనిచేసే చోట, స్విమ్మింగ్ పూల్, లేదా ప్లేగ్రౌండ్ ఇలా ఎక్కడైనా సరే కాల్పులకు తెగబడతామని దుండగులు హెచ్చరించారు.
దీనిపై సమాచారం అందుకున్న ఇర్వింగ్ పోలీసులు అమెరికా పోస్టల్ సర్వీస్ను సంప్రదించి విచారణ ముమ్మరం చేశారు.జాత్యహంకార వ్యాఖ్యలు, విద్వేషపూరిత చర్యలను తాము తీవ్రంగా పరిగణిస్తామని, బాధ్యులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ శాఖ స్పష్టం చేసింది.ఈ క్రమంలో ఆగంతకుల నుంచి ఇటువంటి మెయిల్స్ అందుకున్న వారెవరైనా ధైర్యంగా తమకు సమాచారం అందించాలని ఇర్వింగ్ పోలీసులు సూచించారు.
మరోవైపు ఈ ఘటనతో అమెరికాలో స్థిరపడిన ఆసియన్లు భయాందోళనలకు గురవుతున్నారు.