కోవిడ్ 19కి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ప్రపంచంలో భారత్, అమెరికాల కంటే మరే ఇతర దేశం ఎక్కువగా స్పందించలేదని వైట్హౌస్ కరోనా వైరస్ రెస్పాన్స్ కో ఆర్డినేటర్ డాక్టర్ ఆశిష్ ఝా వ్యాఖ్యానించారు.ఇతర దేశాలకు మద్ధతుగా నిలబడటం, విరాళాలు అందించడం, టీకా వేయడం వంటి విషయాల్లో ఇరుదేశాలు చేసిన ప్రయత్నాలను ఆయన హైలైట్ చేశారు.
గత రెండున్నరేళ్లలో కోవిడ్ గురించి ఎంతో శ్రమించామని ఆశిష్ అన్నారు.
భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో భాగంగా భారత రాయబార కార్యాలయంలో ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు.
భారతదేశానికి స్వాతంత్య్రంతో పాటు ఇండో – యూఎస్ మధ్య స్నేహ సంబంధాలు మొదలై 75 ఏళ్లు పూర్తవ్వడం ఆనందంగా వుందన్నారు.మూడున్నర మిలియన్ల మంది భారతీయ అమెరికన్లు ఈ దేశాన్ని మరింత వినూత్నంగా మార్చారని ఆశిష్ ఝా పేర్కొన్నారు.
మానవ స్వేచ్ఛను ప్రోత్సహించడం, విశ్వాసం, చట్టబద్ధమైన పాలన అనే విలువలు రెండు దేశాలను ఏకతాటిపైకి తీసుకొచ్చాయని చెప్పారు.
ఇక ఇదే కార్యక్రమంలో భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధూ మాట్లాడుతూ.రాబోయే పాతికేళ్లలో భారతదేశ ప్రయాణంలో అమెరికా కీలక భాగస్వామి అవుతుందని ఆకాంక్షించారు.భారత్ సానుకూల ప్రగతిని సాధిస్తున్నందున, భవిష్యత్ తరాల ఆకాంక్షలను నెరవేర్చడానికి మనకు ఎంతో పని వుందన్నారు.ఈ ప్రయాణంలో భారత్కు అమెరికా కీలక భాగస్వామిగా మారుతుందని సంధూ ఆకాంక్షించారు.
భారత్ – అమెరికా, మోడీ- బైడెన్ భాగస్వామ్యం ఇరుదేశాలకు, ప్రపంచానికి అత్యంత కీలక సంబంధాలలో ఒకటిగా మారిందన్నారు.ప్రపంచ శాంతి, స్థిరత్వం, మానవాభివృద్ధిని పురోగమింపజేయడానికి ఇరు దేశాల సమ్మేళనాలను ఉపయోగించుకుంటామని సంధూ తెలిపారు.
ఈ ప్రయాణంలో ప్రవాస భారతీయులు మూల స్తంభంగా నిలుస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.