దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు నాలుగు లక్షలకుపైగా నిత్యం నమోదవుతున్నాయి.ఈ పరిస్థితి దేశవ్యాప్తంగానే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి.
అలాగే ఏపీలోనూ ఈ కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగానే ఉంది.నిత్యం 20 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.
దీనికి తోడు ఆక్సిజన్ కొరత తో పాటు, అనేక సమస్యలను ప్రభుత్వం ఎదుర్కొంటోంది.తాజాగా కొత్త ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు, అలాగే వాటిని తరలించే కంటైనర్లు, ఆక్సిజన్ ప్లాంట్ ల నిర్వహణ నిమిత్తం భారీగా ఏపీ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.
క్రమక్రమంగా ఏపీలో వైద్య పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తోంది.అయితే రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండడం, పూర్తిస్థాయిలో లాక్ డౌన్ అమలు కాకపోవడంతో, ఈ పరిస్థితి ఏర్పడుతోందనే హెచ్చరికలు వస్తుండడంతో, ఏపీ ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
ఇప్పటికే పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాలలో సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేస్తుండడంతో, ఏపీ లోనూ లాక్ డౌన్ విధించాలనే ఒత్తిడి పెరిగిపోతోంది.ఏపీలో కరోనా కేసులు పెరుగుతుండడమే కాకుండా, అంతే స్థాయిలో మరణాలు చోటు చేసుకుంటూ ఉండడం తో ఏపీ ప్రభుత్వం లాక్ డౌన్ విధించాలనే ఒత్తిడి పెరిగిపోతోంది.
ప్రస్తుతం పాక్షికంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.ఉదయం ఆరు గంటల నుంచి 12 గంటల వరకు అన్ని కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతి ఇస్తున్నారు.అయితే సెకండ్ వేవ్ కరోనా కారణంగా ఇప్పుడు ఏపీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.దీంతో పాటు, మూడు వేవ్ కూడా మొదలైందనే వార్తలు మరింతగా జనాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి
దీంతో ఏపీ ప్రభుత్వం సైతం సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తే కొంతకాలం పరిస్థితులు అదుపులోకి వస్తాయని , ఈ లోగా పూర్తి స్థాయిలో ఆక్సిజన్ ప్లాంట్ లతో పాటు, వైద్యపరంగా ఎంతో ప్రగతి సాధించేందుకు సాధ్యమవుతుందనే అభిప్రాయంతో ఉంది.కాకపోతే ఒక్కసారిగా లాక్ డౌన్ విధిస్తే, ఎన్నో రకాల ఇబ్బందులు ఏర్పడతాయనే ఆలోచనతో ఉన్న ఏపీ ప్రభుత్వం క్రమక్రమంగా ఆంక్షలు మరింత కటినం చేస్తూ, కనీసం రెండు వారాల పాటు పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధించాలనే ప్లాన్ లో ఉందట.కేవలం అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఇవ్వాలని చూస్తోందట.
దీనికి సంబంధించి అతి త్వరలో జగన్ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.