దేశ జనాభాలో వాళ్ల సంఖ్య పెరిగితే దేశానికి పెను ప్రమాదమేనట…! ఎవరు వాళ్లు? ముస్లింలు, క్రిస్టియన్లు.దేశంలో ఈ రెండు మతాలవారి జనాభా పెరిగిపోతోందని కొంత కాలంగా గగ్గోలు పుడుతోంది.
క్రిస్టియన్ల సంగతి ఎలా ఉన్నా, ముస్లింల జనాభా విపరీతంగా పెరుగుతోందని హిందూత్వ సంస్థలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి.ముస్లింల జనాభా పెరుగుతోందని ఓ సర్వేలో కూడా తేలిందని కొంతకాలం క్రితం వార్త వచ్చింది.
ముస్లింలంటే ఏమాత్రం పడని శివసేన ఈ వివాదానికి ఆజ్యం పోస్తూనే ఉంది.శివసేన అధికారిక పత్రిక ‘సామ్నా’ తాజా సంపాదకీయం వివాదాస్పదంగా మారింది.
దేశంలో ముస్లింలు, క్రిస్టియన్లు పెరిగితే దేశానికి తీవ్ర ప్రమాదమని హెచ్చరించింది.సమీప భవిష్యత్తులో దేశంలో ముస్లింల జనాభా ఇండొనేషియాను, పాకిస్తాన్ను మించిపోతుందని, దీంతో హిందూ దేశమైన భారత్లో సామాజిక, సాంస్కృతిక అసమానతలు పెరుగుతాయని పేర్కొంది.
ముస్లిం, క్రిస్టియన్ జనాభా పెరగకుండా ఉండాలంటే వేసక్టమీ, కుటుంబ నియంత్రణ పద్ధతులే పరిష్కారమని స్పష్టం చేసింది.ఎంఐఎం నాయకుడు ఓవైసీ మీదా విరుచుకుపడింది.
ఆయన ముస్లిం సోదరుల గురించి బాధపడుతున్నారని అంటూ ఆయన ముస్లింలలో కుటుంబ నియంత్రణను ప్రోత్సహించాలని, ముస్లిం మహిళల్లో బురఖా పద్ధతిని ప్రోత్సహించాలని పేర్కొంది.చిన్న కుటుంబమే చింతలు లేని కుటుంబమని కూడా ఓవైసీకి హితవు చెప్పింది.