గోదావరిలో ఉధృతి మరింత పెరిగింది.దీంతో స్థానిక ముంపు ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షానికి గోదావరి నదిలో వరద నీరు చేరుతోంది.దీంతో వరద ప్రవాహం వేగవంతమైంది.
పెన్ గంగా, ప్రాణహిత నదులు కూడా వరద నీటితో పొంగిపొర్లుతున్నాయి.కిన్నెరసాని, శబరి, తాలిపేరు, కొండవాగుల నుంచి వరద నీరు కొట్టుకొచ్చి గోదావరినదిలో చేరుతుంది.
దీంతో భద్రాచలం ప్రాంతంలో నీటిమట్టం పెరుగుతూ వస్తోంది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రాజెక్టులు, బ్యారేజీ నిండు కుండలా కనిపిస్తున్నాయి.కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అంతర్భాగమైన లక్ష్మీ బ్యారేజీ వరద నీరు చేరడంతో 65 గేట్లును ఎత్తేసి 8.60 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.ధవళేశ్వరంలో బ్యారేజీలో మంగళవారం సాయంత్రానికి 4,06,032 క్యూసెక్కుల వరద నీరు చేరింది.గోదావరి డెల్టా కాలువలకు 11,600 క్యూసెక్కులు వదిలి మిగిలిన 3,89,032 క్యూసెక్కుల నీటిని సముద్రంలో విడుదల చేయనున్నారు.
వరద ఉధృతి పెరగడంతో నదులకు దగ్గర్లో ఉన్న ముంపు ప్రాంతాలను అక్కడి నుంచి తరలించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ముంపు ప్రాంతాల ప్రజలు భయాందోళ చెందుతున్నారని, తక్షణ సహాయక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.