ఇటీవల దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ మొదలైంది.ఈ క్రమంలోనే గత కొద్దిరోజులుగా కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరిగాయి.
దీంతో కేంద్రం కరోనా నియంత్రణ దిశగా చర్యలు చేపట్టింది.ఇక ఏ రాష్ట్రాలు వారీ సొంతంగా లాక్ డౌన్ అమలు చేసుకుంటాయి.
ఇదిలా ఉంటేతెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా పంజా విసురుతుంది.ముఖ్యంగా ఈ కరోనా కేసుల సంఖ్యలలో స్కూల్లలో అధికంగా నమోదవుతుండడం కొంత ఆందోళనకు గురిచేస్తుంది.
ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్కూల్స్ తిరిగి మూసివేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ మూతపడిపోయాయి.
ఇక సంవత్సరం తర్వాత ఇటీవలే పాఠశాలలు తెరుచుకోవడంతో విద్యార్థుల నుంచి ఎలాగైనా ఫీజులు వసూలు చేయాలని భావించిన స్కూల్ యాజమాన్యాలకు ప్రభుత్వ నిర్ణయంతో ఒక్కసారిగా ఖంగు తిన్నారు.ఇంకేముంది ఫీజులు వసూలు చేసేందుకు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు.
స్కూల్స్ మూసివేసిన ఆన్ లైన్ లో పాఠాలు బోధించాలని చెప్పిన ప్రభుత్వ సూచనలను తుంగలో తొక్కి ఫీజు కడితేనే క్లాసులు అనే విధంగా చేస్తున్నారు.ఇక కొన్ని స్కూల్ యాజమాన్యాలు ఫీజు కోసం విద్యార్థులను వేధిస్తున్న సంఘటనలు మరెన్నో ఈ క్రమంలోనే ఓ పాఠశాల యాజమాన్యం ఫీజు కట్టేవరకు విద్యార్థులను ఇంటికి పంపమంటూ గదిలో బంధించిన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళితే మెదక్ పట్టణంలోని సిద్ధార్థ్ మోడల్ స్కూల్ బుధవారం ఫీజులు కడితేనే గానీ విద్యార్థులను పంపించేది లేదంటూ ఏకంగా 60 మంది విద్యార్థులను ఓ గదిలో బంధించింది.విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు స్కూల్కు చేరుకొని యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యార్థుల తల్లిదండ్రులు ఎంత బ్రతిమిలాడినా విద్యార్థులను వదిలిపెట్టలేదు.దీంతో విద్యార్థి సంఘాల నేతలు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవడంతో సంబంధిత విద్యాశాఖ అధికారులు స్పంధించారు.
అయినా కూడా సంవత్సరం నుంచి పెండింగులో ఉన్న ఫీజులను కడితేనే విద్యార్థులను పంపిస్తామని మొండికేయడంతో చివరికి పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్, ఎంఈఓ నీలకంఠం స్కూల్ వద్దకు చేరుకొని యాజమాన్యంతో మాట్లాడి, పరిస్థితి సద్దుమణిగింది.
ముందస్తు సమాచారం లేకుండా డబ్బులు అడిగితే ఎక్కడి నుంచి తీసుకురావాలని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు.స్కూల్ యాజమాన్యం తీరుపై విద్యార్థి సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఫీజులు వసూలు చేయొద్దని చెప్పినా వారి మాటలు తుంగలో తొక్కి సిద్దార్థ్ స్కూల్ యాజమాన్యం మొండిగా వ్యవహరించడం స్థానికంగా కలకలం రేపింది.వెంటనే సిద్దార్థ్ విద్యా సంస్థల యాజమాన్యంపై కేసులు నమోదు చేసి, దాని గుర్తింపును రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు, తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.