ఏపీ నేడు ఉప ఎన్నికల పోలింగ్ మొదలైంది.ఈ ఎన్నికల్లో టిడిపి జనసేన పార్టీలు పోటీకి దూరంగా ఉన్నాయి.
సెంటిమెంట్ రాజకీయాలకు తాము కట్టుబడి ఉన్నామంటూ ఈ రెండు పార్టీలు ప్రకటించి ఈ ఉప ఎన్నికల బరి నుంచి పక్కకు తప్పుకున్నాయి. దీంతో బిజెపి కాంగ్రెస్ వైసీపీ ల మధ్య పోరు నెలకొంది.
హోరాహోరీగా మూడు పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాయి.ప్రధానంగా మూడు పార్టీల మధ్యే పోటీ ఉన్నా, వైసీపీ విజయానికి ఢోకా లేదనే విశ్లేషణలు వచ్చాయి.
దీనికి తగ్గట్లుగానే ఆ పార్టీ మెజారిటీ పైనే ఎక్కువ దృష్టి పెట్టింది.ఇక పెద్దగా బలం లేకపోయినా , వైసీపీతో తలపడేందుకు బిజెపి పెద్ద సాహసమే చేసింది.
ఏదైతేనేం నేడు బద్వేల్ లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారనే ఆసక్తి నెలకొంది.
వైసీపీకి గతంలో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ ఓట్లు వస్తే ప్రభుత్వంపై ప్రజలు సంతృప్తి ఉందనే అభిప్రాయం జనాల్లోకి వెళ్తుందని ఆ పార్టీ నమ్మకం పెట్టుకుంది.అంతేకాకుండా జగన్ సొంత జిల్లా కావడం తో ఇక్కడ తమకు తిరుగు ఉండదనే నమ్మకంతో వైసిపి ఉండగా, బిజెపి సైతం గెలుపు పై నమ్మకం పెట్టుకుంది.
ఇక్కడ పోటీకి దూరంగా ఉన్న జనసేన, టిడిపికి ఓటు బ్యాంకింగ్ ఏ పార్టీ వైపు ఉంటుందనేది ఉత్కంఠగా మారింది.వాస్తవంగా టిడిపి, జనసేన పార్టీ లు వైసిపి ప్రభుత్వాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి.
ఈ మధ్యకాలంలో ఈ పోరు మరింత తీవ్రమైంది.దీంతో జనసేన టిడిపి ఓటు బ్యాంకింగ్ బిజెపి వైపు మళ్ళుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
జనసేన పార్టీతో బిజెపి పొత్తు పెట్టుకున్నా, రెండు పార్టీలు విడివిడిగానే రాజకీయ వ్యవహారాలు చేస్తున్నాయి.దీంతో జనసేన ఓటర్లు ఎంతవరకు బిజెపికి అండగా నిలబడతారు అనేది తేలాల్సి ఉంది.ఇక టిడిపి విషయానికి వస్తే ఆ పార్టీ కి అనుకూలంగా ఉండే ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారా లేక బిజెపి వైపు వెళ్తారా ? అనేది టెన్షన్ పుట్టిస్తోంది.బద్వేల్ లో పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది.
సాయంత్రం ఏడు గంటల వరకు జరగనుంది.ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.
అలాగే పోలింగ్ ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేయడంతో పాటు, వెబ్ కాస్టింగ్ సౌకర్యం కూడా కల్పించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి విజయానంద్ తెలిపారు.