ఏపీలో కొత్త రాజకీయం చేసేందుకు ఇంతా స్పీడ్ గా రాజకీయాల్లోకి వచ్చిందో చేదు ఫలితాలతో అంతే స్పీడ్ గా ఆ పార్టీ అడుగులు వెనక్కి పడిపోతున్నాయి.సినీ గ్లామర్ రాజకీయాలకు వర్తించదు అనే విషయాన్ని మరోసారి గుర్తుచేస్తూ జనసేన పార్టీ ప్రస్థానం సాగుతోంది.
ఎన్నికల ఫలితాల అనంతరం ఆ పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.పార్టీలో ఉండాలో, బయటకి వెళ్లాలో తెలియక ఆందోళనలో కనిపిస్తున్నారు.
కొంతమంది ఇప్పటికే జనసేన నుంచి జారుకున్నారు.ఇక పవన్ చుట్టూ ఉండే నాయకులకు కూడా ఇదే రకమైన గందరగోళం నెలకొంది.
తమ రాజకీయ భవిష్యత్తు ఏంటో తెలియక వారు సతమతం అయిపోతున్నారు.ఇదే సమయంలో పవన్ వైకిరి కూడా నాయకులకు మింగుడుపడడంలేదు.
గతంలో ఇదే రకమైన ఊపుతో రాజకీయాల్లో అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి ఆ తరువాత రాజకీయంగా చేదు ఫలితాలు చవి చూడడంతో ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు.ఆ తరువాత కొంతకాలం కాంగ్రెస్ లో మంత్రి పదవి చేసిన చిరు ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
ముగిసిన ఈ ఎన్నికల్లో కనీసం తక్కువలో తక్కువ 30 స్థానాలు, నాలుగైదు లోక్ సభ స్థానాలు వస్తాయని జనసేన గంపెడు ఆశలు పెట్టుకోగా ఒక్కటంటే ఒక్క అసెంబ్లీ స్థానాన్ని దక్కించుకుని రాజకీయంగా వెనుకబడిపోయింది.అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వయంగా పోటీ చేసిన రెండు స్థానాలలోనూ ఓడిపోయారు.
అనేకచోట్ల డిపాజిట్లు కూడా దక్కలేదు.ఇప్పుడు కూడా ఇదే పార్టీని పట్టుకుని వేలాడితే ఆర్థికంగానూ, సామాజికంగాను వెనుకబాటు తప్పదని డిసైడ్ అయిన ఆ పార్టీలోని కొంతమంది కీలక నాయకులు మెల్లిగా అధికార పార్టీలో చేరేందుకు పావులు కడుపుతున్నారట.
వైసీపీలో చేరడం ఇబ్బందిగా భావిస్తున్న కొందరు కేంద్ర అధికార పార్టీ బీజేపీలో చేరేందుకు చూస్తున్నారట.ఏపీలో త్వరలో నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన సత్తా చాటుదాం అంటూ పవన్ కళ్యాణ్ ప్రకటించినా పార్టీలోనూ ప్రజల్లోనూ పెద్దగా స్పందన కనిపించడంలేదు.ఇప్పటివరకు పార్టీ కోసం లెక్కకు మిక్కిలిగా చేతి చమురు వదిలించుకున్నామని, ఇక ఈ ఎన్నికల్లోనూ చేతి చమురు వదిలించుకునేందుకు తాము సిద్ధంగా లేమంటూ ఆ పార్టీకి ఆర్ధిక అండదండలు అందిస్తున్న కొంతమంది సైడ్ అయిపోతున్నారట.అసలు తమ పార్టీ అధ్యక్షుడు ఈ ఐదేళ్లపాటు పార్టీని నడపగలరా అనే సందేహం కూడా వారిలో నెలకొందట.
మొత్తంగా చూసుకుంటే జనసేనకు రామ్ రామ్ చెప్పేయడమే బెటర్ అన్న ఆలోచనలో చాలామంది నాయకులు ఉన్నారట.