అక్రమ మార్గాల్లో అమెరికాలో అడుగుపెట్టాలని భావించేవారి సంఖ్య నానాటికీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే అక్కడి బోర్డర్ సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ అధికారులకు చిక్కి జైల్లో మగ్గుతున్న వారి సంఖ్య తక్కువేం కాదు.
అలాగే సాహసాలు చేసి ప్రాణాలు పొగొట్టుకునేవారు ఇటీవలి కాలంలో పెరుగుతున్నారు.కొద్దినెలల క్రితం అమెరికా- కెనడా సరిహద్దుల్లో నలుగురు భారతీయులు అతి శీతల వాతావరణ పరిస్ధితులను తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
ఈ ఘటన డాలర్ డ్రీమ్స్పై మన వారికి వున్న వ్యామోహాన్ని తెలియజేస్తోంది.ఎలాగైనా అమెరికా చేరుకోవాలనుకున్న వారి ఆశల్ని మృత్యువు ఆవిరి చేసింది.
ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నా.మనదేశంలోని యువత అక్రమ మార్గాల్లో అమెరికాకు వెళ్లే ప్రయత్నాలను మాత్రం మానడం లేదు.
ఈ క్రమంలో ఈ ఏడాది అక్రమ మార్గాల్లో పట్టుబడిన వారి వివరాలను యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం గత వారం విడుదల చేసింది.
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే భారతీయుల సంఖ్య 2022లో రెండింతలు పెరిగినట్లు తెలిపింది.
గతేడాది అక్టోబర్ , నవంబర్ నెలల్లో మెక్సికో సరిహద్దు వద్ద 4,297 మంది భారతీయుల్ని అదుపులోకి తీసుకోగా… 2021లో ఇదే సమయంలో అమెరికాలోకి అక్రమంగా చొరబడుతూ పట్టుబడ్డ వారి సంఖ్య 1,426.మొత్తంగా 2022 సెప్టెంబర్తో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో పలు దేశాలకు చెందిన 2.77 మిలియన్ల మంది అగ్రరాజ్యంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.అలాగే గతేడాది తొలి ఆరు నెలల్లో కెనడా సరిహద్దు నుంచి 10,562 మంది భారతీయ వలసదారులు అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించారని ఏజెన్సీ తెలిపింది.
లాక్డౌన్, కరోనా, ఉపాధి అవకాశాలు లేకపోవడం వంటి కారణాలతో వలసలు చోటు చేసుకున్నట్లు సీబీపీ పేర్కొంది.అటు అమెరికా ఉత్తర సరిహద్దు ప్రాంతాల్లో అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన 1,200 మంది భారతీయులను పట్టుకున్నట్లు వెల్లడించింది.మరోవైపు… అమెరికాకు అక్రమ వలసలను నిరోధించేందుకు డొనాల్డ్ ట్రంప్ హయాంలో మెక్సికో, అమెరికా సరిహద్దుల్లో భారీ గోడను నిర్మించిన సంగతి తెలిసిందే.ఎలాగైనా అగ్రరాజ్యంలో అడుగుపెట్టాలనే లక్ష్యంతో కొందరు ఆ గోడను దాటేందుకు సైతం ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
మొన్నామధ్య ఓ భారతీయుడు గోడను ఎక్కుతున్న క్రమంలో ప్రమాదవశాత్తూ జారిపడిపోయి మరణించాడు.ఈ ప్రమాదంలో అతని భార్య, మూడేళ్ల కుమారుడికి తీవ్రగాయాలయ్యాయి.