దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ ప్రభావం దేశంలోని కోట్ల ఉద్యోగాలపై పడింది.
దేశంలో కోట్ల సంఖ్యలో ఉద్యోగులు కరోనా, లాక్ డౌన్ వల్ల ఉద్యోగాలు కోల్పోయి ఇంటికే పరిమితమయ్యారు.యువత, ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లు కొత్త ఉద్యోగాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ప్రైవేట్ సంస్థలు ఇప్పట్లో కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి సిద్ధంగా లేకపోయినా తాజాగా ఐఐటీ ఢిల్లీ నుంచి వింత నోటిఫికేషన్ వెలువడింది.
ఢిల్లీ ఐఐటీ తాజాగా డాగ్ హ్యాండ్లర్ ఉద్యోగం కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఢిల్లీ ఐఐటీ సెక్యూరిటీ ఆఫీస్ లో పని చేసే ఈ ఉద్యోగానికి ఐఐటీ ఢిల్లీ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలని కోరడం గమనార్హం.ప్రస్తుతం ఐఐటీ ఢిల్లీ విడుదల చేసిన నోటిఫికేషన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఢిల్లీ ఐఐటీ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ లో రెండు కొత్త విషయాలు ఉన్నాయి.
ఒకటి బీటెక్ లేదా బీకాం లేదా బీఎస్సీ లేదా బీఏ చదివిన వాళ్లు ఈ ఉద్యోగానికి అర్హులు కాగా రెండోది ఈ ఉద్యోగానికి ఢిల్లీ ఐఐటీ 45,000 రూపాయల వేతనం చెల్లిస్తోంది.21నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న భారతీయ పౌరులు ఈ ఉద్యోగానికి అర్హులు.ఉద్యోగానికి ఎంపికైన వారి మూడు నెలల పనితీరును పరిశీలించి వారిని కొనసాగించాలో లేదో ఢిల్లీ ఐఐటీ నిర్ణయం తీసుకుంటుంది.
కుక్కలకు దాణా వేయడం, వైద్య సహాయం అందించడం, టీకాలు వేయడం ఎంపికైన వారు చేయాల్సి ఉంటుంది.ఈ నోటిఫికేషన్ ను చూసి బీటెక్ పట్టా చివరకు కుక్కను కాపలా కాయడానికి ఉపయోగపడుతుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.