మనలో అనేకమంది అవసరం నిమిత్తమో, ఉద్యోగంలో భాగంగానో నిత్యం ప్రయాణాలు చేయవలసిన అవసరం వస్తుంది.ఇందులో రైళ్లు వెసులుబాటు వున్నవారు ముందుగా వీటికే ప్రాధాన్యత ఇస్తారు.
ఎందుకంటే ధర తక్కువ, పైగా సౌకర్యవంతం.అయితే ఇక్కడ మగవాళ్ళు ఎలాంటి ప్రయాణం చేసినా అది సాఫీగానే సాగిపోతుంది.
అదే ఆడవారైతే, ఇప్పుడు బతుకుతున్న సమాజంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.అందుకే రైల్వే వారు రైళ్లల్లో ఒంటరిగా ప్రయాణించే మహిళల కోసం కొన్ని రక్షణ చట్టాలను తీసుకువచ్చారు.
ఈ చట్టాలపై మహిళా ప్రయాణికులకు కాస్త అవగాహన లోపం వుంది.అందుకే ఇపుడు వాటిగురించి తెలుసుకుందాం.
1989లోనే ఒంటరిగా ప్రయాణించే మహిళలకు రక్షణగా నిలిచేలా కొన్ని చట్టాలను తీసుకువచ్చారు.ఆ చట్టాల ప్రకారం మహిళలకు రక్షణ చేకూరుతుంది.
1.భారతీయ రైల్వే యాక్ట్ 1989లో సెక్షన్ 139 ప్రకారం, ఒక మహిళా ప్రయాణికురాలు ఒకవేళ పురుషుల తోడు లేకుండా ఒంటరిగా లేదా తన బిడ్డతో ప్రయాణిస్తే, ఆమెకు రైల్వే పాస్ లేదా టికెట్ లేదన్న కారణంతో రాత్రి సమయంలో అర్ధాంతరంగా రైలు నుంచి దిగమని రైల్వే సిబ్బంది ఎట్టి పరిస్థితులలోను ఆదేశించకూడదు.
2.ఇక భారతీయ రైల్వే యాక్ట్ 1989లో సెక్షన్ 311 ప్రకారం, మిలిటరీ సిబ్బంది మహిళల కోసం కేటాయించిన కంపార్ట్మెంట్లలోకి ప్రవేశిస్తే, అలాంటి బోగీల్లోకి ప్రవేశించకుండా వారిని మర్యాదపూర్వకంగా నిరోధించే అధికారం మహిళలకు కలదు.
3.భారతీయ రైల్వే యాక్ట్ 1989లో, సెక్షన్ 162 ప్రకారం.
తప్పనిసరి పరిస్థితులలో 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న అబ్బాయిలు మాత్రమే మహిళల కోసం కేటాయించిన బోగీలో ప్రయాణించడానికి అర్హులు.ఒకవేళ 12 ఏళ్ళకంటే ఎక్కువ వయస్సు గలవారు లేడీస్ కోచ్లలోకి ప్రవేశిస్తే, చట్టం ప్రకారం విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది.
4.రైల్వే బెర్తుల్లో ఆడవారికి గల ప్రత్యేక రిజర్వేషన్ సదుపాయం గురించి అందరికీ తెలిసిందే.
5.దూర ప్రాంతాలకు వెళ్లే స్లీపర్ క్లాస్ బోగీల్లో 6 బెర్తులు మహిళలకు కేటాయించింది.
గరీబ్ రథ్, రాజధాని, దురంతో రైళ్లల్లో థర్డ్ క్లాస్ బోగీల్లో, ఏసీ ఎక్స్ప్రెస్ రైళ్లల్లో 6 బెర్తుల్ని కూడా కేటాయించింది.మహిళలకు వయస్సుతో నిమిత్తంలేదు.
6.లోయర్ బెర్తుల్లో కూడా మహిళలకే ప్రాధాన్యం ఎక్కువ.
స్లీపర్ క్లాసులో ప్రతీ కోచ్లో 6 నుంచి 7 లోయర్ బెర్తులు, థర్డ్ ఏసీ బోగీల్లో 4 నుంచి 5 లోయర్ బెర్తులు, సెకండ్ ఏసీలో 3 నుంచి 4 లోయర్ బెర్తులు కేటాయించడం విశేషం.ఈ బెర్తుల్ని వృద్ధులు, 45 ఏళ్లు దాటిన మహిళలు, గర్భిణుల కోసం ప్రత్యేకంగా కేటాయించడం కొసమెరుపు.
7.మహిళల భద్రత, రక్షణ కోసం నిత్యం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మహిళా సిబ్బందితో రైళ్లల్లో తనిఖీలు చేయిస్తోంది.
గవర్నమెంట్ రైల్వే పోలీస్, డిస్ట్రిక్ట్ పోలీస్ సహాయం కూడా తీసుకుంటోంది.ఇక ఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో మేరీ సహేలీ కార్యక్రమాన్ని దేశమంతా ప్రారంభించింది.ఈ కార్యక్రమం ద్వారా మహిళలు రైలు ఎక్కిన స్టేషన్ నుంచి గమ్యస్థానం చేరుకునే వరకు భద్రతను అందిస్తోంది.
8.రైల్వే స్టేషన్లతో పాటు రైళ్లల్లో కూడా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తోంది.మహిళలతో పాటు రైల్వే ప్రయాణికుల కోసం 139 ఇండియన్ రైల్వేస్ హెల్ప్లైన్ నెంబర్ను 24 గంటల పాటు అందుబాటులో ఉంచింది.
సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా మహిళల సమస్యల్ని తెలుసుకుంటోంది.