ఏదైనా వస్తువు రిపేరుకు ఇచ్చినప్పుడు వచ్చే బిల్లు మహా ఎంత ఉంటుంది.దాని అసలు ధరలో 10 శాతం నుంచి 25 శాతం వరకు ఉంటుంది.
అయితే బెంగళూరులో విచిత్రమైన సంఘటన జరిగింది.ఇటీవల వరదల్లో మునిగిపోయిన కారును సర్వీస్ సెంటర్కు పంపించాడు.
తీరా తనకు వచ్చిన బిల్లు చూసి కంగుతిన్నాడు.వోక్స్వ్యాగన్ పోలో హ్యాచ్బ్యాక్ ధర రూ.11 లక్షలు కాగా, దానికి రూ.22 లక్షల బిల్లు వేశారు.దీంతో ఈ వార్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.ఇటీవల బెంగళూరులో భారీ వర్షాలు కురవడంతో నగరం మోకాళ్ల లోతు నీటిలో మునిగిపోయింది.రోజుల తరబడి రోడ్లు జలమయం కావడం, విమానాలు దారి మళ్లించడం, ఇళ్లలోకి వర్షపు నీరు చేరడం, ప్రజా రవాణా వ్యవస్థ దెబ్బతినడం, పడవలు, ట్రాక్టర్ల ద్వారా ప్రయాణం చేయాల్సి వచ్చింది.అనేక భవనాలు నీటమునిగాయి.
అనిరుధ్ గణేష్ అనే వ్యక్తికి చెందిన వోక్స్వ్యాగన్ పోలో హ్యాచ్బాక్ కారు కూడా ఇటీవల వరదలకు నీటిలో మునిగిపోయింది.దీంతో అతను వైట్ఫీల్డ్లోని వోక్స్వ్యాగన్ ఆపిల్ ఆటోకు వాహనాన్ని పంపాడు.
రాత్రి 11 గంటలకు నడుము లోతు నీటిలో ఉన్న టోయింగ్ ట్రక్కుపైకి తన కారును నెట్టవలసి వచ్చిందని తెలిపాడు.చివరికి ఏదోలా సర్వీస్ సెంటర్కు పంపితే వచ్చిన బిల్లు చూసి షాక్ అయినట్లు చెప్పాడు.
తన బాధను అంతా లింక్డ్ఇన్లో వెళ్లగక్కాడు.తాను వోక్స్వ్యాగన్ ఇండియాకు కాల్ చేశానని, వారికి కూడా మెయిల్ చేశానని తెలిపాడు.48 గంటల్లో ప్రతిస్పందన వస్తుందని చెప్పినట్లు పేర్కొన్నాడు.అక్కడ స్పందన లేదని వాపోయాడు.
ఈ పోస్ట్ కొద్ది సేపటికే వైరల్ అయ్యింది.వోక్స్వ్యాగన్ కస్టమర్లను దోపిడీ చేస్తున్నందుకు నెటిజన్లు విమర్శించడం ప్రారంభించారు.
అసలు ధర కంటే దాని రిపేరుకు ఎక్కువ ఖర్చు అవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.