కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఐపీఎల్ 2021 అర్ధాంతరంగా నిలిచిన విషయం తెలిసిందే.అయితే ఐపీఎల్లో మిగిలిన మ్యాచ్లను సెప్టెంబర్ 18 నుంచి నిర్వహించే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు.
ఇప్పటికే ఈ ఐపీఎల్ టోర్నీని యూఏఈకి తరలించిన విషయం తెలిసిందే.ఐపీఎల్ 2021 సీజన్లో మిగిలిన 31 మ్యాచ్లను సెప్టెంబరు- అక్టోబరులో యూఏఈ వేదికగా భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్వహించబోతోంది.
అయితే యూఏఈకి వచ్చి ఐపీఎల్ మ్యాచ్లను ఆడేందుకు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెటర్లు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.అక్టోబరులోనే టీ20 వరల్డ్కప్ కూడా ప్రారంభంకానుండటంతో ఆటగాళ్లకి రెస్ట్ ఇవ్వాలని ఆ రెండు దేశాల క్రికెట్ బోర్డులు యోచిస్తున్నాయి.
దానికి తోడు ఐపీఎల్ కోసం కఠినమైన బబుల్లో ఉండేందుకు ఆటగాళ్లు కూడా ఇష్టపడటం లేదు.మొత్తంగ విదేశీ క్రికెటర్లు ఐపీఎల్లో ఆడేందుకు అనాసక్తిని కనబరుస్తున్నారు.
విదేశీ క్రికెటర్లు రాకపోయినా ఐపీఎల్ 2021 సీజన్లో మిగిలిన 31 మ్యాచ్లను నిర్వహించి తీరుతామని బీసీసీఐ ధీమా వ్యక్తం చేస్తోంది.మరోవైపు ఎక్కువగా విదేశీ క్రికెటర్లపై ఆధారపడే ఓ మూడు జట్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆటగాళ్లని యూఏఈకి పిలిపించాలని పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు ఒకవేళ మ్యాచ్లు ఆడేందుకు యూఏఈకి రాకపోతే జీతాల్లో కోత విధిస్తామని కూడా ఆటగాళ్లకి ఆ ఫ్రాంఛైజీలు హెచ్చరించినట్లు సమాచారం.ఆటగాళ్లకు చెల్లించే పారితోషికంలో కోత పెట్టే హక్కులు ఫ్రాంచైజీలకు ఉన్నాయని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
ఆటగాళ్ళు ఇప్పటి వరకు ఆడిన మ్యాచులకే వేతనం చెల్లించే అవకాశం ఉందని ఆయన వివరించారు.అయితే బీసీసీఐ ఒప్పంద ఆటగాళ్లకు జీతాల్లో ఎలాంటి కోత ఉండదని ఆయన స్పష్టం చేసారు.2011 నుంచి ఒప్పంద ఆటగాళ్లకు భీమా వర్తిస్తుండం వల్ల వారి జీతాల్లో కోత ఉండదని వివరించారు.