తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు, ఆయన మంత్రులకు ఏమైందో అర్థం కావడంలేదు.‘యథా ముఖ్యమంత్రి…తథా మంత్రులు’ అన్నట్లుగా ఉంది పరిస్థితి.పురాతన ఉస్మానియా ఆస్పత్రిని కూల్చేసి జంట భవనాలు కడతానని ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే, ఉప ముఖ్యమంత్రుల్లో ఒకడైన మహమూద్ అలీ రెండాకులు ఎక్కువ చదువుకున్నట్లుంది.‘అవసరమైతే చార్మినార్నూ కూలగొడతాం’ అన్నాడు.హైదరాబాదులోని వారసత్వ కట్టడాలను (హెరిటేజ్ బిల్డింగ్్స) నిర్వహించడానికి వంద కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయని అన్నారు.ఇంతవరకు అంటే బాగానే ఉంది.హైదరాబాదుకు ప్రతీక అయిన చార్మినార్ బలహీనమైతే దాన్ని కూడా కూలగొడతామన్నారు.చార్మినార్ బలహీనపడితే కూలిపోతుందని, అదే జరిగితే ప్రజల ప్రాణాలు పోతాయని అన్నారు.
ఉస్మానియా ఆస్పత్రి నిర్వహణకు వంద కోట్ల రూపాయలు ఖర్చు చేసినా అది పదేళ్లకు మించి ఉండదని, పదేళ్ల తరువాత దాన్ని కూలగొడితే మంచి ఆస్పత్రి కట్టొచ్చని ఉప ముఖ్యమంత్రి అన్నారు.మహమూద్ అలీ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దీనిపై కాంగ్రెసు నాయకుడు వి హనుమంతరావు మాట్లాడుతూ తాజ్మహల్ కూడా పురాతన కట్టడమే కదా.మరి దాన్ని కూడా కూలగొడతారా? అని ప్రశ్నించారు.ఉస్మానియా ఆస్పత్రిని కూలగొట్టాలని కేసీఆర్ అన్నప్పటి నుంచి ఆయనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.ఇంతకు ముందు రవీంద్రభారతిని కూడా కూలగొడతానన్నారు.కొత్త రవీంద్ర భారతి ఎలా ఉంటుందో ఆ నమూనా కూడా మీడియాకు విడుదల చేశారు.ఉస్మానియా ఆస్పత్రి పక్కన ఎనిమిది ఎకరాల స్థలం ఉందని, అక్కడ కొత్త ఆస్పత్రి భవనం కట్టొచ్చని అందరూ చెబుతున్నా కేసీఆర్ పట్టించుకోవడంలేదు.
ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో వారసత్వ సంపదను రక్షిస్తామని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు కూల్చివేత జపం చేస్తున్నారు.మెట్రో రైల్వే లైను సుల్తాన్ బజార్ మీదుగా వెళ్లేందుకు వీలులేదని, అది చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రాంతమని ఒకప్పుడు కేసీఆర్ ఊదరగొట్టారు.
అసెంబ్లీ ముందు నుంచి కూడా మెట్రో లైన్ పోకూడదన్నారు.కాని పురాతన కట్టడాలను నిర్దాక్షిణ్యంగా కూలగొడతామంటున్నారు.
కేసీఆర్ వైఖరి అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది.