భారత్లో కరోనా సెకండ్ వేవ్ ఏ స్థాయిలో కల్లోలాన్ని రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ప్రతిరోజూ లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలతో ఇండియా వణికిపోయింది.
ముందస్తు ప్రణాళిక లేకపోవడం, పాలకుల దూరదృష్టి లోపించడంతో భారత్లో రెండో దశ ఉత్పన్నమైందని మేధావులు ఆరోపించారు.ఫిబ్రవరి చివరి నుంచి జూన్ మొదటి వారం వరకు దేశాన్ని వైరస్ సునామీలా ముంచెత్తింది.
కోవిడ్ సోకిన వారు చికిత్స తీసుకునేందుకు బెడ్లు ఖాళీగా లేవు, దీనికి తోడు ఆక్సిజన్, వెంటిలేటర్లు, మందులు, టెస్టింగ్ కిట్లు ఇలా అన్నింటి కొరత వేధించింది.ప్రభుత్వం నిద్ర లేచే సమయానికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సరిగా నిర్వర్తించకపోవడం కూడా సెకండ్ వేవ్కు కారణమని పలు నివేదికలు తేల్చాయి.
మనదేశ అవసరాలు పక్కనబెట్టి మరి.ప్రధాని మోడీ టీకా దౌత్యం పేరిట అనేక దేశాలకు వ్యాక్సిన్ డోసులను ఉచితంగా పంపారు.దీంతో భారత్లో అసరమైన సమయంలో టీకాల కొరత వేధించింది.
మనదేశంలో ఉత్పత్తి వేగవంతం చేద్దామంటే ఔషధాల తయారీకి కావాల్సిన ముడిపదార్థాల ఎగుమతులపై అమెరికా సహా పలు దేశాలు నిషేధం విధించాయి.దీంతో భారత్ టీకాల కోసం అంతర్జాతీయ సమాజం వైపు చూసింది.
ఇటు వైపు చూస్తే అమెరికాలో మిలియన్ల కొద్ది డోసుల టీకాలు గోడౌన్లలో మగ్గుతున్నాయి.దీంతో వాటిని భారత్ వంటి కరోనాతో అల్లాడుతున్న దేశాలకు అందజేయాల్సిందిగా అధ్యక్షుడు జో బైడెన్పై సొంత పార్టీతో పాటు విపక్షాలు, మేధావులు, నిపుణులు ఒత్తిడి తెచ్చారు.
దీంతో ఆయన కాస్త మెత్తబడి భారత్కు సాయం ప్రకటించారు.దానితో పాటే ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా కోవిడ్తో అల్లాడుతున్న వివిధ దేశాలకు 80 మిలియన్ డోసుల వ్యాక్సిన్ ఇస్తామని బైడెన్ ప్రభుత్వం ప్రకటించింది.
అయితే అమెరికా నుంచి టీకా సాయం పొందే విషయంలో భారత్లో చట్టాలు ప్రతిబంధకంగా మారాయి.టీకా విరాళాలను స్వీకరించే విషయంలో చట్టపరమైన అంశాలను భారత్ సమీక్షిస్తోందని అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ తెలిపారు.తాము మాత్రం సాయం చేయడానికి సిద్ధంగానే వున్నామన్నారు.80 మిలియన్ డోసులను వివిధ దేశాలకు పంపిణీ చేయాలని నిర్ణయించిన విధంగానే ఇప్పటికే నేపాల్, పాకిస్థాన్, భూటాన్, బంగ్లాదేశ్ సహా పలు దేశాలకు అమెరికా నుంచి 40 మిలియన్ డోసుల టీకాలు చేరాయి.కానీ భారత్లో చట్టపరమైన సమస్యలు అడ్డుపుల్ల వేస్తున్నాయి.దీంతో అమెరికా నుంచి వ్యాక్సిన్ డోసులు రావడంలో జాప్యం జరుగుతోంది.