కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని ఆర్ధిక సంక్షోభంలోకి నెట్టింది.సంపన్న దేశాలతో పాటు పేద దేశాలను ఈ వైరస్ ఆర్ధికంగా అతలాకుతలం చేసింది.
అసలే మాంద్యంతో కుదేలవుతున్న ప్రపంచానికి కరోనా శరాఘాతంలా తగిలింది.అంతర్జాతీయ ఆర్ధిక వ్యవస్ధలు గాడితప్పి, సామాజిక అశాంతి ప్రబలి, అధినేతల పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో వివిధ దేశాలకు విద్య, ఉద్యోగ, వ్యాపారాల కోసం వెళ్లాలనుకునే వారికి సేవలు అందించే వీసా కన్సల్టెన్సీలు, ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్లకు కరోనాతో గడ్డుకాలం దాపురించింది.కోవిడ్ 19 కారణంగా విదేశీయుల రాకపై దేశాలన్నీ ఆంక్షలు విధించడంతో ఇలాంటి సంస్థల నిర్వహణ భారంగా మారింది.
ఉదాహరణకు పంజాబ్లోని జలంధర్, లూధియానా నగరాల నుంచి ప్రతియేటా వేల సంఖ్యలో భారతీయులు విదేశాలకు వెళతారు.ఇందుకు అవసరమైన చట్టపరమైన లాంఛనాలు, ఇతరాత్ర డాక్యుమెంటేషన్ కోసం ఈ రెండు నగరాల్లో పెద్ద సంఖ్యలో వీసా కన్సలెన్సీలు, ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్ (ఐఈఎల్టీఎస్) కోచింగ్ సెంటర్లు ఉన్నాయి.
కరోనా కారణంగా ఈ సంస్థలు కార్యాలయ భవనాలకు అద్దె, ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని స్ధితిలో ఉన్నాయి.లూధియానాకు చెందిన స్టడీ అబ్రాడ్ సంస్ధ ఇటీవల అద్దె, ఇతర పన్నుల నుంచి మినహాయింపు కోరుతూ డిప్యూటీ కమీషనర్, ముఖ్యమంత్రి కార్యాలయాలకు ఓ మెమోరాండం పంపింది.
లూధియానాలోని వీసా కన్సల్టెన్సీలు ప్రతి ఏటా 35 వేల నుంచి 40 వేల వరకు ఇమ్మిగ్రేషన్కు సంబంధించిన శిక్షణను ఇస్తాయి.వీసా కన్సల్టెన్సీలకు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో మంచి డిమాండ్ ఉంటుంది.ఎందుకంటే ఆ సమయంలో విదేశాల్లో విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది.అందువల్ల విద్యార్ధులు వీసా సాయం కోసం ఈ సంస్ధలను సంప్రదిస్తారు.అయితే ఈ ఏడాది కరోనా పుణ్యమా అని కన్సల్టెన్సీల బిజినెస్ అటకెక్కింది.
కరోనా వైరస్ను అరికట్టడంలో భారత ప్రభుత్వం విఫలమైతే, రాబోయే రోజుల్లో కొన్ని దేశాలు భారతీయుల ప్రవేశాన్ని అనుమతించే పరిస్ధితి ఉండకపోవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇదే జరిగితే తమ కార్యాలయాలను మూసివేయాల్సిందేనని పలు సంస్ధలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.అయితే ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్న కొందరు అభ్యర్ధులకు మాత్రం ఆయా సంస్ధలు ఆన్లైన్ ద్వారా శిక్షణను అందిస్తున్నాయి.
మార్కెట్లో ఉన్న అనిశ్చితి కారణంగా ఈ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు దాదాపు మూడు నెలల నుంచి వేతనాలు అందడం లేదని సమాచారం.