ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి కి సంబందించిన పరీక్షల వ్యూహాన్ని ఐసిఎమ్ఆర్ మార్చివేసింది.కొత్త రూల్స్ ప్రకారం ఇన్ ఫ్లూయెంజా లక్షణాలు ఉన్నా కూడా కరోనా పరీక్షలు నిర్వహించాలని ఐ సీ ఎమ్ ఆర్ సూచిస్తుంది.
అలానే ఈ వైరస్ పరీక్షలు జరుపకపోయినా అత్యవసర వైద్య సేవలు, కాన్పులను మాత్రం ఆలస్యం చేయకూడదని ఐసీఎంఆర్ (భారత వైద్య పరిశోధన మండలి) స్పష్టంచేసింది.ఈ మేరకు కరోనా పరీక్షలకు సంబంధించి సవరించిన మార్గదర్శకాలను ఐసీఎంఆర్ సోమవారం జారీ చేసినట్లు తెలుస్తుంది.
స్వరాష్ట్రాలకు చేరిన వలస కార్మికుల్లో, విదేశాల నుంచి తిరిగి వచ్చినవారిలో ఇన్ఫ్లుయెంజా లక్షణాలు ఉంటే వారంలోపు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని కొత్త మార్గదర్శకాలను వెల్లడించింది.అలానే పాజిటివ్గా వచ్చినవారిని కలిసిన వారిలో కరోనా లక్షణాలు లేకపోయినా ఐదు నుంచి పది రోజుల మధ్యలో ఒకసారి వైరస్ పరీక్ష నిర్వహించాలని ఐసీఎంఆర్ సూచించింది.
ఈ లక్షణాలున్న వ్యాధులతో ఆసుపత్రిలో చేరిన రోగులతో పాటు కంటైన్మెంట్, క్వారంటైన్ ప్రదేశాల్లో సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికీ రియల్ టైమ్ ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయాలని ఆదేశించింది.దేశంలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను ఈ మేరకు సవరిస్తూ తాజాగా ఐసీఎమ్ ఆర్ నూతన మార్గదర్శకాలను జారీచేసినట్లు తెలుస్తుంది.