కరోనా మహమ్మారి కారణంగా ప్రతి ఆటలోనూ సరి కొత్త నిబంధనలు పుట్టుకొస్తున్నాయి.ముఖ్యంగా క్రికెట్ పై కరోనా చాలా ప్రతికూల ప్రభావం చూపింది.
దీంతో క్రికెట్ నిర్వాహకులు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.సరి కొత్త నిబంధనలు ప్రవేశపెడుతూ క్రికెట్ ఆటను మరింత పవర్ఫుల్గా తీర్చిదిద్దుతున్నారు.పురుషుల టీ20 వరల్డ్ కప్ వారం రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఐసీసీ అధికారులు మరో అనూహ్య నిబంధనను తీసుకొచ్చారు.టీ20 వరల్డ్ కప్లో తొలిసారిగా డెషిషన్ రెవ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్) అనే ఓ కొత్త నిబంధనను ప్రవేశపెడుతున్నామని ప్రకటించారు.
గ్రౌండులో ఉన్న అంపైర్లు డెసిషన్ ఇవ్వగా వారి డెసిషన్ ను సమీక్షించడానికి ‘డెసిషన్ రివ్యూ సిస్టమ్‘ ఉపయోగపడుతుంది.కరోనా కాలంలో అనుభవజ్ఞులైన అంపైర్లు క్రికెట్ మ్యాచ్ లకు దూరంగా ఉన్నారు.
దీంతో అనుభవం లేని అంపైర్లతోనే ప్రస్తుత మ్యాచ్లను నెట్టుకొస్తున్నారు.అయితే ఈ కొత్త అంపైర్ల నిర్ణయాల్లో లోపాలు తలెత్తే సమస్య ఉంది కాబట్టి ‘డెసిషన్ రివ్యూ సిస్టమ్’ను తొలిసారిగా టీ20 లీగ్ మ్యాచ్ల్లో తీసుకొచ్చారు.
నిజానికి ప్రతీ ఇన్నింగ్స్లో జట్టుకు 2 రివ్యూలు ఉంటాయి.కానీ ఐసీసీ ఐపీఎల్ వంటి టీ20 లీగ్స్లో ఒకటే రివ్యూ అవకాశం కల్పిస్తూ వస్తోంది.
కరోనా వేళ టీ20 వరల్డ్ కప్లోనూ రెండు రివ్యూలకు ఐసీసీ అవకాశం కల్పిస్తూ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.
యూఏఈ వేదికగా ఐపీఎల్ 2021 సీజన్ పూర్తయిన వెంటనే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లు ప్రారంభమవుతాయి.అక్టోబర్ 17వ తారీఖు నుంచి ఒమన్లో క్వాలిఫయింగ్ మ్యాచ్లు జరగనున్నాయి.అనంతరం యూఏఈ వేదికగా సూపర్ 12 రౌండ్ మ్యాచ్లు జరుగుతాయి.
ఐదేళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ జరుగుతుండడం విశేషం.ఐసీసీ ఆధ్వర్యంలో 2016లో పురుషుల టీ20 వరల్డ్ కప్ జరిగింది.
ఆ సమయానికి టీ20ల్లో డీఆర్ఎస్ నిబంధనలను అమలు చేయలేదు.అయితే ఐసీసీ అధికారులు 2018లో జరిగిన మహిళల టీ20 వరల్డ్ కప్ నుంచి డీఆర్ఎస్ను అమలు చేస్తున్నారు.
దీన్ని ఇప్పుడు తొలిసారిగా పురుషుల టీ20 వరల్డ్ కప్లోనూ ప్రవేశపెట్టారు.