సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వరస శిశు మరణాలు గర్భిణీ స్త్రీలను హడలెత్తిస్తున్నాయి.నేను రాను తల్లో సర్కార్ దవాఖానకు అంటూ మహిళలు భయంతో వణికిపోతున్నారు.
కేవలం మూడు రోజుల వ్యవధిలో ఇద్దరు శిశువులు మృత్యువాత పడడంతో ఆసుపత్రిలో ఉన్న గర్భిణీలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళడానికి ఆసక్తి చూపుతున్నారు.ఆదివారం డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా మరో శిశువు గర్భంలోనే మృతి చెందడంతో ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యంతోనే శిశువుల మరణాలు జరుగుతున్నాయని సూర్యాపేట జనరల్ హాస్పిటల్ ముందు బంధువులు ఆందోళనకు దిగారు.
బంధువులు తెలిపిన వివరాల ప్రకారం పెన్ పహాడ్ మండలం భక్తాలపురం గ్రామానికి చెందిన ఆవుల చందన మొదటి కాన్పు కొరకు సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు.శుక్రవారం పురిటి నొప్పులు రావడంతో అంబులెన్స్ సహాయంతో హాస్పిటల్ కు తీసుకురాగా డాక్టర్లు పరీక్షించి నార్మల్ డెలివరీ కొరకు ప్రయత్నించారు.
శనివారం మధ్యాహ్నం పరీక్షలు చేసి శిశువు మరణించినట్లు చెప్పారు.డాక్టర్లు శిశువు మృతికి కారణాలు చెప్పాలంటూ బంధువులు సిబ్బందిని నిలదీశారు.
దీనితో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులు వారిపై దురుసుగా ప్రవర్తించారు.అంతేకాకుండా గర్భిణీ వద్ద బ్లడ్ శాంపిల్స్ తీసుసుకొని అవి టెస్టులకు పంపకుండా కూడా తాత్సారము చేయడంతో శిశువు మరణించినట్లు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రికి రావాలంటేనే ఒక పక్క భయం వేస్తుందని,మనుషుల ప్రాణాలంటే కనీస విలువలేకుండా పోయిందని మండిపడుతున్నారు.బంగారు తెలంగాణ అని చెప్పుకుంటున్న మన ప్రభుత్వం,పేదల పట్ల ఇంత కక్షపూరితంగా ఇంత నిర్లక్ష్యంగా ఉండడం తగదని బాధితులు వాపోతున్నారు.
సామాన్యులు ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లాలంటే ఖర్చుతో కూడుకున్న విషయం కావటంతో ప్రభుత్వ హస్పటల్ వస్తున్నారు.ఇక్కడ సమయానికి డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆవేదన చెందుతున్నారు.
అంతేకాకుండా ఆసుపత్రి సిబ్బంది పేషెంట్ ను పక్క వార్డుకు స్ట్రక్చర్ పై తీసుకెళ్లాలంటే 200 నుంచి 300 వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.శిశువు మృతి చెందినదని తెలిసి కూడా బయటకు తీయాలంటే నార్మల్ డెలివరీ చేసేందుకు ప్రయత్నం చేశారంటూ బంధువులు ఆరోపించారు.
ఇదిలా ఉంటే తల్లికి బీపీ లెవెల్స్ పెరగడంతో శిశువు మృతి చెందిందని,మూడు రోజుల్లో నార్మల్ డెలివరీ చేస్తే తల్లి ప్రాణాలకు హాని ఉండదని డాక్టర్లు చెబుతున్నారు.