ఈ మాట అన్నది ప్రధాని నరేంద్ర మోదీ కాదు.పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు అధినేత్రి మమతా బెనర్జీ.
మమత చాలా కఠిన హృదయురాలని, ఆస్పత్రుల్లో వందలాదిమంది చిన్న పిల్లలు చనిపోతున్నా ఆమె పట్టించుకోరని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంటాయి.ఇప్పుడు ఆమె మాత్రం ‘ఎవరూ చావాలని కోరుకోను’ అంటున్నారు.
ఎందుకన్నారు ఈ మాట? ఈమధ్య ఢిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ భూసేకరణ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ బహిరంగ సభ నిర్వహించిన సమయంలో రాజస్థాన్కు చెందిన గజేంద్ర సింగ్ అనే రైతు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలుసు కదా.దానిపై దేశమంతా అట్టుడుకుతున్న నేపథ్యంలో మమత ఈ వ్యాఖ్య చేశారు.భూసేకరణ సవరణ బిల్లును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు.రైతుల నుంచి బలవంతంగా భూములు గుంజుకునే బిల్లుపై తమ వైఖరి నిర్దిష్టంగా ఉందని, పార్లమెంటులో దాన్ని వ్యతిరేకించి తీరుతామని చెప్పారు.
రైతులు తమకు ఇష్టమైతేనే భూములు ఇవ్వాలని, అందుకు బేరం ఆడుకునే హక్కు ఉండాలని అన్నారు.రాజస్థాన్ రైతు ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్నారు.మమత ఇప్పుడు చెప్పింది బాగానే ఉందిగాని బెంగాల్లో అరాచకం కొనసాగుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.