కెనడా రక్షణ మంత్రిగా ఇటీవల నియమితులైన భారత సంతతికి చెందిన అనితా ఆనంద్ కెనడియన్ మిలటరీలోని లైంగిక వేధింపుల అంశంపై స్పందించారు.ఈ సంస్థాగత సంక్షోభానికి తెరదించగలనని ఆమె విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
ఈ లైంగిక వేధింపుల వల్లే ఈమెకు ముందు రక్షణ మంత్రిగా వున్న హర్జిత్ సజ్జన్ తన శాఖను వదులుకున్న సంగతి తెలిసిందే.మిలటరీలోని ఈ సంక్షోభాన్ని చక్కదిద్దడమే తన మొదటి ప్రాధాన్యత అని అనితా ఆనంద్ ఆదివారం ట్వీట్ చేశారు.
మిలటరీలో దుష్ప్రవర్తన కేవలం మహిళలు ఒక్కరే ఎదుర్కొంటున్న సమస్య కాదని.సైన్యం ప్రభావవంతంగా వుండాలంటే, అందులోని సభ్యులు సురక్షితంగా వుండాల్సిన అవసరం వుందన్నారు.
కాగా.సాయుధ దళాల్లోని లైంగిక వేధింపుల అంశం ఈ ఏడాది జనవరిలో వెలుగులోకి వచ్చింది.దీంతో అప్పటి డిఫెన్స్ చీఫ్ జనరల్ జోనాథన్ వాన్స్ తన పదవికి రాజీనామా చేశారు.ఈ సంక్షోభాన్ని నివారించడంలో సజ్జన్ విఫలం చెందినట్లు నిర్ధారణ కావడంతో కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో తన కేబినెట్ను పునర్వ్యస్థీకరించారు.
దీనిలో భాగంగానే సజ్జన్ను డిఫెన్స్ మినిస్టర్గా తప్పించి అంతర్జాతీయ అభివృద్ధి మంత్రిగా నియమించారు.అతని స్థానంలో అనితా ఆనంద్కు రక్షణ శాఖ బాధ్యతలు అప్పగించారు.
డిఫెన్స్ మినిస్టర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనితా ఆనంద్ ఒక ట్వీట్ చేశారు.కెనడా సాయుధ బలగాలు మనదేశాన్ని రక్షించడానికి తమ జీవితాలను త్యాగం చేస్తారని.
వారు సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణంలో పనిచేసేలా చూడాల్సిన అవసరం వుందన్నారు.
ఇక 54 ఏళ్ల అనితా ఆనంద్ ఓక్ విల్లే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
అనితా ఆనంద్ తల్లిదండ్రులు భారతీయులే. తల్లి పంజాబ్కు చెందిన డాక్టర్ సరోజ్ దౌలత్ రామ్, తండ్రి తమిళనాడుకు చెందిన డాక్టర్ సుందర్ వివేక్ ఆనంద్.
వీరికి ఐర్లాండ్లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ఇంగ్లాండ్లో పెళ్లి చేసుకున్నారు.భారత్, నైజీరియాలలో నివసించిన వీరు 1965 నుంచి కెనడాలో స్థిరపడ్డారు.
ఇప్పటికీ వీరి బంధువులు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరులలో ఉన్నారు.అనిత తాతగారు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు.
2019 అక్టోబర్లో అనిత కెనడా పార్లమెంట్కు ఎన్నికయ్యారు. హౌస్ ఆఫ్ కామన్స్కు ఎన్నికై, ప్రధాని జస్టిన్ టూడ్రో కేబినెట్లో మంత్రి పదవి దక్కించుకున్న మొదటి హిందూ మహిళగా రికార్డుల్లోకెక్కారు.ప్రస్తుతం నలుగురు పిల్లలకు తల్లిగా ఉన్న అనితా ఆనంద్ ఓక్విల్లే ప్రాంతంలోని ప్రజలకు అత్యంత సన్నిహితంగా మెలుగుతారు.రాజకీయాల్లోకి రాకముందు టొరంటో విశ్వవిద్యాలయంలో లా ప్రొఫెసర్గా ఆమె సేవలందించారు.