ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్కు వ్యాక్సిన్ కనుగొనేందుకు అన్ని దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు.ఎక్కడా చూసినా ట్రయల్స్ నడుస్తున్నాయన్న మాటే వినిపిస్తుంది కానీ.
తుది దశకు చేరిందన్న వార్తలు రావడం లేదు.కానీ అప్పటి వరకు మానవాళిని కాపడటానికి ఆయా దేశ ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నాయి.
అయితే కోరోనా సోకిన వారికి మలేరియా నివారణలో ఉపయోగించే హైడ్రాక్సీక్లోరోక్విన్ ద్వారా మంచి ఫలితాలు వస్తున్నట్లు అనేక దేశాల శాస్త్రవేత్తలు చెబుతున్న సంగతి తెలిసిందే.
స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మాట చెప్పేసరికి అందరికి గురి కుదిరింది.
దీంతో ఈ డ్రగ్ ఉత్పత్తి, ఎగుమతుల్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న భారతదేశానికి అన్ని దేశాలు క్యూకట్టాయి.దీనిపై స్పందించిన ప్రధాని నరేంద్రమోడీ మానవతా దృక్పథంతో మనకు సరిపడా నిల్వలు వుంచుకుని కావాల్సిన దేశాలకు ఎగుమతి చేశారు.
కాగా కరోనాను ఎదుర్కోవడానికి ముందు జాగ్రత్త చర్యగా తాను హైడ్రాక్సీక్లోరోక్విన్ తీసుకుంటున్నానని ట్రంప్ వెల్లడించారు.
గత 10 రోజుల నుంచి ఈ మాత్రలు వేసుకుంటున్నట్లు వెల్లడించిన ఆయన తనలో ఇప్పటి వరకు ఎలాంటి వైరస్ లక్షణాలు కనిపించలేదని స్పష్టం చేశారు.వైట్ హౌస్లోని తన అధికార వైద్యులు సూచించకపోయినప్పటికీ.తాను రోజుకు ఓ మాత్ర చొప్పున ఈ మందులు వాడుతున్నట్లు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు.
కరోనా ప్రభావిత దేశాల్లో వీటిని వాడుతున్నారని.అక్కడి రోగుల్లో సత్ఫలితాలు రావడం వల్లే తానూ ఉపయోగిస్తున్నట్లు అగ్రరాజ్యాధినేత స్పష్టం చేశారు.
ట్రంప్ హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలు తీసుకుంటున్న విషయాన్ని వైట్హౌస్ వర్గాలు ధ్రువీకరించాయి.కాగా అమెరికాలో ఇప్పటి వరకు 15,37,830 మంది వైరస్ బారినపడగా, వీరిలో 90,694 మంది ప్రాణాలు కోల్పోయారు.