అనుమతి లేకుండా మలేషియాలో ఎక్కువ రోజులు గడిపినందుకు గాను హైదరాబాదీని అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు.దీంతో తమ బిడ్డను విడిపించాల్సిందిగా బాధితుడి తల్లిదండ్రులు భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
వివరాల్లోకి వెళితే… హైదరాబాద్కు చెందిన మహ్మద్ చాంద్ పాషా ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం వెతుకుతున్నాడు.ఈ నేపథ్యంలో స్థానికంగా ట్రావెల్ ఏజెంట్గా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి నివాసి సతీశ్తో పరిచయం ఏర్పడింది.
మలేషియాలోని ఓ టిష్యూ తయారీ సంస్థలో నెలకు 30 వేల జీతం, వసతితో కూడిన ఉద్యోగం ఇప్పిస్తానని సతీశ్ అతనికి హామీ ఇచ్చాడు.దీనిలో భాగంగా పాషా గతేడాది జూలై 20న మలేషియా వెళ్లాడు.
కానీ అక్కడ అతనికి సతీశ్ చెప్పిన ఉద్యోగం లభించలేదు.దీనిపై పాషా ఆరా తీయగా త్వరలోనే ఉద్యోగ వీసా లభిస్తుందని అందువల్ల కొంతకాలం మలేషియాలోనే ఉండాలని సతీశ్ అతనికి చెప్పాడు.
అప్పటికే పాషా వీసా గడువు ముగియడంతో భారత్కు వచ్చేయాలని భావించాడు.అయితే కరోనా కారణంగా రెండు దేశాల్లోనూ లాక్డౌన్ విధించారు.
ట్రావెల్ ఏజెంట్ సతీశ్.పాషాను ఉద్యోగ వీసాలో కాకుండా విజిట్ వీసాపై మలేషియాకు పంపాడు.విజిట్ వీసా గడువు ముగిసేలోపే అతనికి జాబ్ వీసా అందిస్తామని నమ్మబలికాడు.కానీ మలేషియా చేరుకున్న తర్వాత అతనిని సేల్స్మేన్ లేదంటే ఏదైనా చిన్న ఉద్యోగం చేయాల్సిందిగా సతీశ్ కోరాడు.
ఇక అక్కడ ఉండలేనని నిర్ణయించుకున్న పాషా వందే భారత్ మిషన్లో పేరు నమోదు చేసుకుని ఆగస్టు 24న భారత్కు వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు.కానీ ఈలోగానే మలేషియా అధికారులు కౌలాలంపూర్ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు.
ఈ విషయం తెలుసుకున్న పాషా తల్లిదండ్రులు.కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని తమ బిడ్డను రక్షించాలని కోరుకుంటున్నారు.